అమెరికా ఎన్నికల్లో అంతరాయం? -హోంల్యాండ్ సెక్యూరిటీ అప్రమత్తత -భద్రతకు భరోసా
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో అంతరాయం ఏర్పడిందా? మంగళవారం ఎలక్షన్ డే సందర్భంగా ఏదైనా అనూహ్య ఘటనలు జరిగే అవకాశముందా? సున్నితమైన, కీలకమైన ప్రాంతాల్లో భారీ ఎత్తున బలగాల మోహరింపులు అందుకేనా? అంటే అవునని సమాధానం ఇస్తున్నాయి అధికార వర్గాలు.
సంచలనం: అమెరికా తొలి మహిళా ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ - నెలరోజుల్లోనే చూస్తారన్న ట్రంప్
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది. దేశరాధాని వాషింగ్టన్ డీసీ, ఆర్థిక రాజధాని న్యూయార్క్ సహా 50 రాష్ట్రాల్లోని అన్ని కౌంటీల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. అయితే పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే కొన్ని చోట్ల అవాంతరాలు ఏర్పడినట్లు హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. అది ఏరకమైన అవాంతరం? దాని పర్యవసానాలు ఏమిటనేది మాత్రం వారు వెల్లడించలేదు. అయితే..
మొత్తంగా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్నదని, రాజధాని డీసీకి వెలుపలున్న మానిటరింగ్ సెంటర్ నుంచి ఫెడరల్ అధికారులు అనుక్షణం పర్యవేక్షణ జరుపుతున్నారని హోం ల్యాండ్ సెక్యూరిటీ 'సైబర్ సెక్యూరిటీ' విభాగం అధికారులు తెలిపారు. వియన్నాలో ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికాలో ఎన్నికలకు ఏవైనా బెదిరింపులు వస్తున్నాయా అనే దానిపైనా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని, ప్రస్తుతానికి పెద్ద సమస్యలేవీ ఉత్పన్నం కాలేదని చెప్పారు.
ట్రంప్ కోసం హిందూ సేన పూజలు -చైనా, పాక్ పని పట్టడంలో భారత్కు సాయపడతారని..
యుఎస్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ డైరెక్టర్ క్రిస్టోఫర్ క్రెబ్స్ మంగళవారం ఓ ప్రకటన చేస్తూ.. ఎన్నికల ప్రక్రియలో అంతరాయం ఏర్పడే సూచనలున్నాయని చెప్పారు. అయితే వివరాలను మాత్రం బయటికి చెప్పలేదు. కాగా, అమెరికన్లు వేసే ఓటు సురక్షితమైందని, భద్రత, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మరోవైపు..
ఎలక్షన్ డే సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. వాష్టింగ్టన్ డీసీ లోని వైట్ హౌస్ చుట్టుపక్కల సెక్యూరిటీ టైట్ చేశారు. న్యూయార్క్ డౌన్ టౌన్, బేవర్లీ హిల్స్(లాస్ ఏజింల్స్) తదితర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. అనుకోని విపత్తు తలెత్తితే క్షణాల్లోనే నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు.
అమెరికాలో మొత్తం 23.92కోట్ల మంది ఓటర్లుండగా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే 10 కోట్ల మంది ముందస్తుగా ఓట్లేశారు. మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపడతారు. రెండోసారి విజయంపై ట్రంప్ ధీమాగా ఉండగా, ఈసారి డెమోక్రట్లే గెలుస్తారని జోబైడెన్ చెబుతున్నారు.