ట్రంప్-జో బిడెన్ థర్డ్ వార్: పోలింగ్ ముంగిట్లో ఆధిక్యంలో డొనాల్డ్: మరోసారి మేజిక్?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఎన్నికల ప్రచార ర్యాలీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అధికారాన్ని నిలుపుకోవడానికి రిపబ్లికన్ పార్టీ.. ఈ దఫా విజయాన్ని సాధించడానికి డెమొక్రటిక్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డతున్నాయి. ఎన్నికల తేదీ సమీపిస్తోన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ మెజారిటీని సాధించే దిశగా సాగుతున్నారు. మొదట్లో తన ప్రత్యర్థి జో బిడెన్ కంటే మెజారిటీలో వెనుకంజలో కనిపించిన ట్రంప్.. ఇప్పుడు ఆయనపై ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. 2.6 శాతం మేర మెజారిటీని సాధించారు.
జో బిడెన్ గెలిస్తే..: భారత్ భవిష్యత్పై ట్రంప్ కుమారుడు సంచలనం: మోడీతో సంబంధాలపైనా
మూడో విడత వాడివేడిగా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్-జో బిడెన్ మధ్య మూడో విడత డిబేట్ కొనసాగనుంది. టెన్సెస్సె నాష్విల్లేలోని బెల్మోంట్ యూనివర్శిటీలో మూడో విడత డిబేట్ను ఏర్పాటు చేశారు. ఎన్బీసీ న్యూస్ కరెస్పాండెంట్ క్రిస్టెన్ వేకర్ మోడరేట్గా వ్యవహరిస్తారు. సరిగ్గా 90 నిమిషాల పాటు ఈ డిబేట్ కొనసాగుతుంది. ఒక్కో టాపిక్ మీద 15 నిమిషాల పాటు డిబేట్ కొనసాగుతుంది. మొత్తం నాలుగు డిబేట్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందులో రెండో డిబేట్ రద్దయింది.
కరోనా వల్ల రెండో డిబేట్ క్యాన్సిల్..
షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 15వ తేదీన రెండో విడత డిబేట్ను నిర్వహించాల్సి ఉండగా.. డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ బారిన పడ్డారు. అప్పటికే ఆయన కోలుకున్నప్పటికీ.. ప్రత్యక్షంగా డిబేట్లో పాల్గొనడానికి జో బిడెన్ అంగీకరించలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టడానికి ఆయన మొగ్గు చూపారు. ఈ ఫార్మట్లో డిబేట్కు డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోలేదు. ఫలితంగా- దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. వర్చువల్ ఫార్మట్లో నిర్వహించ తలపెట్టిన ఈ డిబేట్లో పాల్గొనడానికి ట్రంప్ అంగీకరించలేదు. దాని వల్ల సమయం వృధా అవుతుందే తప్ప ఉపయోగం ఉండబోదని తేల్చారు.
మూడో విడత వాడివేడిగా..
అమెరికా కాలమానం ప్రకారం 22వ తేదీ రాత్రి 9 గంటలకు ఈ డిబేట్ను నిర్వహిస్తారు. తొలి విడత డిబేట్లోనే అనేక అంశాలు చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి, ఆర్థిక వ్యవస్థ.. వంటి ఎనిమిది కీలక అంశాలపై వాడివేడిగా చర్చ కొనసాగింది. రెండో విడత రద్దు కావడంతో.. అందులో ప్రస్తావనకు రావాల్సిన అంశాలను మూడో దఫా డిబేట్లో చర్చకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. నాలుగో విడత ముఖాముఖి కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నారు. అదే చివరిది. నవంబర్ 3వ తేదీన ఎన్నికలను నిర్వహిస్తారు.
Recommended Video
2016 నాటి పరిస్థితులు ఏర్పడుతున్నాయా?
ఎన్నికల గడువు సమీపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్.. తన ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడం.. ఆసక్తి రేపుతోంది. మొదట్లో వెనుకంజలో ఉన్న ఆయన ప్రస్తుతం పుంజుకొన్నారు. తాజాగా చేపట్టిన ఐబీడీ/టీఐపీపీ 2020 అధ్యక్ష ఎన్నికల ట్రాకింగ్ పోల్ ప్రకారం.. ట్రంప్ స్వల్పంగా జో బిడెన్పై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ 48.1 శాతం మద్దతును కూడగట్టుకోగా.. జో బిడెన్కు ఈ సంఖ్య 45.8 శాతం మేర నమోదైంది. 2016లోనూ మొదట్లో వెనుకపడ్డ ట్రంప్.. క్రమంగా పుంజుకొన్నారు. అవే పరిస్థితులూ ఇప్పుడూ నెలకొన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.