పంతం నెగ్గుతుందా?: ట్రంప్ నిర్ణయానికి హౌజ్ ఆమోదం.. మరి సెనేట్?
ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభలో మెజారిటీ సభ్యులు దీనికి ఆమోద ముద్ర వేశారు. మొత్తం 235మంది సభ్యులున్న హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో 192మంది దీనిపై సానుకూలంగా స్పందించారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ వలసలకు బ్రేక్ వేయడానికి ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేయడం, ఐటీ కంపెనీలు సైతం స్థానికతకే పెద్ద పీట వేసేలా చేయడం, ట్రావెల్ బ్యాన్.. ఇలా వరుస నిర్ణయాలు తీసుకున్నారు.
ఇదే క్రమంలో మెక్సికో-అమెరికా సరిహద్దు మధ్య ప్రహరీ గోడ నిర్మించాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఇందుకోసం అయ్యే ఖర్చును మెక్సికో కూడా భరించాలని మెలిక పెట్టడంతో.. ఆ దేశం అందుకు ఒప్పుకోలేదు. దీంతో అమెరికానే ఈ ఖర్చు మొత్తాన్ని భరించాలని నిర్ణయించుకుంది.
ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభలో మెజారిటీ సభ్యులు దీనికి ఆమోద ముద్ర వేశారు. మొత్తం 235మంది సభ్యులున్న హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో 192మంది దీనిపై సానుకూలంగా స్పందించారు. హౌజ్ ఆమోద ముద్రతో ప్రహారీ గోడ నిర్మాణానికి అవసరమైన 1.6బిలియన్ డాలర్లను ప్రత్యేకంగా గోడ నిర్మాణం కోసం మంజూరు చేయనున్నారు.
కాగా, అక్రమ వలసలను అరికట్టేందుకు, మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునేందుకు అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ బిల్లు సెనేట్ లోను ఆమోద ముద్ర వేయించుకోవాల్సి ఉంది. సెనేట్ లో డెమోక్రాట్లు అధికంగా ఉండటంతో బిల్లు కార్యరూప దాల్చాలంటే వారి ఆమోదం తప్పనిసరి. చూడాలి మరి ట్రంప్ నిర్ణయం ఎంతమేర అమలుకు నోచుకుంటుందో!