US advisory: ఇండియా, కాంబోడియా, స్లొవేనియా వెళ్లొద్దు: ఏ విమానం దొరికితే ఆ విమానంతో వెనక్కి
వాషింగ్టన్: భారత్లో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ నెలకొల్పిన సంక్షోభ పరిస్థితుల పట్ల అగ్రరాజ్యం అమెరికా తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తోంది. కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్లో కరోనా వైరస్ పరిస్థితులు చేయి దాటిపోయాయని, ఆ దేశం వైపు ఎవరూ వెళ్లొద్దంటూ తమ దేశ పౌరులకు సూచించింది. ఇప్పటికే భారత్లో ఉండి ఉంటే.. వీలైనంత త్వరగా స్వదేశానికి రావాలని అమెరికా ప్రభుత్వం సూచించింది. భారత్తో పాటు కాంబోడియా, స్లోవేనియాలకు సంబంధించి ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది అమెరికా. తమ దేశ పౌరుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ హైఅలర్ట్ను జారీ చేసినట్లు తెలిపింది.
మొన్న ఢిల్లీ..నిన్న కర్ణాటక: లాక్డౌన్లో మరో పెద్ద రాష్ట్రం: రేపటి నుంచే: గైడ్లైన్స్ ఇవే
లెవెల్ 4 ట్రావెల్ అడ్వైజరీ..
ఈ మేరకు అమెరికా ప్రభుత్వ అధికారులు లెవెల్ 4 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశారు. అత్యంత సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోన్న దేశానికి మాత్రమే ఉద్దేశించిన ట్రావెల్ అడ్వైజరీ అది. లెవెల్ 4.. ఆ దేశం జారీ చేసే ట్రావెల్ అడ్వైజరీల్లో ఇదే గరిష్ఠస్థాయికి చెందినది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ స్థాయి అడ్వైజరీని ఇస్తుంటుంది అమెరికా. భారత్, కాంబోడియా, స్లొవేనియాకు సంబంధించి అలాంటి ఆందోళనకర ట్రావెల్ అలర్ట్ను ప్రస్తుతం జారీ చేసింది.
పరిమితంగా వైద్య సదుపాయాలు..
లెవెల్ 4 ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసిన సందర్భంగా యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్బ్యూరో ఆఫ్ కాన్సుల్ ఎఫైర్స్ అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ పరిస్థితులు భారత్లో తీవ్ర సంక్షోభాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ను ధీటుగా ఎదుర్కొనడానికి అవసరమైనన్ని వైద్యపరమైన వసతులు, సౌకర్యాలు లేవని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సేవలను అందిపుచ్చుకోవడానికి అతి పరిమితంగా మాత్రమే వనరులు ఉన్నాయని తెలిపారు. ఈ పరిణామాల వల్ల ఇప్పట్లో ఎవరూ భారత్కు వెళ్లొద్దని చెప్పారు.
కాంబోడియా.. స్లొవేనియాల్లోనూ
అలాగే- భారత్లో ఉన్న తమ దేశ పౌరులందరూ వెంటనే వెనక్కి వచ్చేయాలని సూచించారు. భారత్ నుంచి అమెరికాకు రోజువారీ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేశారు. ఫ్రాన్ప్లోని ప్యారిస్, జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ మీదుగా అమెరికా రావడానికి అవసరమైన 14 విమాన సర్వీసులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంబోడియా, స్లొవేనియాల్లోనూ కరోనా వైరస్ సృష్టించిన పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెలిపారు. ఈ రెండు దేశాలకు సంబంధించిన హెల్త్ అలర్ట్స్ను డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్బ్యూరో ఆఫ్ కాన్సుల్ ఎఫైర్స్ అధికారులు జారీ చేశారు.
రికార్డు స్థాయిలో కొత్త కేసులు..
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా తన కరాళ నృత్యాన్ని కొనసాగిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు కుప్పలు తెప్పల్లా వచ్చి పడుతున్నాయి. వాటి ఉధృతి ఏ మాత్రం తగ్గుముఖం పట్టట్లేదు. రోజువారీ కరోనా వైరస్ కేసులు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. తాజాగా నాలుగు లక్షలకు చేరువ అయ్యేలా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం..దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,79,257 నమోదు కావడం మాటలు కాదు. ఈ 24 గంటల వ్యవధిలో 3,645 మంది మరణించగా.. 2,69,507 డిశ్చార్జ్ అయ్యారు.
Recommended Video