మెదళ్ల చోరీ: ఆన్లైన్లో విక్రయించిన అమెరికన్, అరెస్ట్
ఇండియానా మెడికల్ హిస్టరీ మ్యూజియంలోని గిడ్డింగిలో ఉంచిన సుమారు 60కి పైగా మానవ మృతదేహాల మెదళ్లను, మానవ కణజాలలను డేవిడ్ చార్లెస్ (21) అనే యువకుడు దొంగిలించినట్లు పోలీసులు తమ విచారణలో తేల్చారు. మ్యూజియంలో 1890లో పోస్టు మార్టం నిర్వహించిన మృతదేహాల మెదళ్లను దొంగిలించాడని పోలీసులు తెలిపారు. కంపెనీ పాలసీకి విరుద్ధంగా మానవ శరీర భాగాల అమ్మకాలు జరిగాయని కోర్టు తన పత్రాల్లో వెల్లడించింది.
దొంగతనంపై విచారణ జరిపిన ఇండియానా పోలీసులు కాలిఫోర్నియాలో చార్లెస్ను అదుపులోకి తీసుకున్నారు. కోర్టుల ప్రతుల ప్రకారం నిందితుడు పలు మానవ శరీర భాగాలను విక్రయించాడని పలువురు మ్యూజియం అధికారులు ఆరోపించారు. తనకు కాలిఫోర్నియా నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చిందని, ఆరు కణజాలాలు, మెదళ్లను 600 డాలర్లకు ఆన్లైన్ ద్వారా విక్రయం జరిపినట్లు తనకు ఒకరు వివరించారని మ్యూజియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేరీ ఎలెన్ హెనెస్సీ నొట్టేజ్ పేర్కొన్నారు.
విక్రయాలు జరిపిన భాగాలను మ్యూజియం వెబ్ సైట్లలో ఉన్న భాగాలతో సరిపోల్చితే ఇక్కడివే అని తేలడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మ్యూజియం అధికారుల సహాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చార్లెస్ను డిసెంబర్ 16న అరెస్ట్ చేశారు. విచారణలో చార్లెస్ మరికొన్ని మెదళ్లను, కణ జాలాలను 4, 800 డాలర్లకు విక్రయం జరిపినట్లు తేలింది. ఈ దొంగతనం తర్వాత మీడియాతో మాట్లాడిన మ్యూజియం డైరెక్టర్ మేరీ ఎలెన్ ఆందోళన వ్యక్తం చేశారు.