ఏ క్షణమైనా రష్యా దాడి: పౌరులను వెనక్కి పిలిపించిన అమెరికా: ఎంబసీ ఖాళీ: భారత్ హైఅలర్ట్
కీవ్: ఆఫ్ఘనిస్తాన్లో సుదీర్ఘకాలం పాటు మోహరింపజేసిన తన సైన్యాన్ని అమెరికా ఉపసంహరించుకున్న తరువాత.. అక్కడి పరిస్థితులు ఎలా మారిపోయాయో చూశాం. రాత్రికి రాత్రి తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రోజుల తరబడి దీనికి సంబంధించిన వార్తలు ప్రపంచాన్ని చుట్టేశాయి. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు మళ్లీ అలాంటి ఉద్రిక్త పరిస్థితులే నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. అవి ఏ విపత్కర పరిస్థితులకు దారి తీస్తాయోననే భయాందోళనలు కారణమౌతోంది.
సరిహద్దుల్లో లక్షకు పైగా సైనికులు..
యూరోపియన్ దేశం ఉక్రెయిన్లో నెలకొన్న తాజా పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోన్నాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొద్దిరోజులుగా చోటు చేసుకుంటూ వస్తోన్న ఘర్షణ- మరింత తీవ్రరూపాన్ని దాల్చింది. ఏ క్షణమైనా ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు దిగే అవకాశాలు ఉన్నాయనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని తరలిస్తోంది రష్యా. ఇప్పటికే 1,27,000 మంది సైన్యాన్ని తరలించినట్లు అమెరికా అంచనా వేసింది. దీన్ని మరింత ముమ్మరం చేసింది.
రాయబార కార్యాలయం ఖాళీ..
ఈ ఉద్రిక్త పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా అప్రమత్తమైంది. రాజధాని కీవ్లోని తన రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయిస్తోంది. కొంతమంది కీలక అధికారులు మినహా.. మిగిలిన వారందరూ తక్షణమే రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేయాలని, కుటుంబాలతో సహా స్వదేశానికి తిరిగి రావాలని ఆదేశించింది. అక్కడితో ఆగలేదు అమెరికా. ఉక్రెయిన్లో నివసిస్తోన్న తమ దేశ పౌరులు వెంటనే వెనక్కి రావాలని సూచించింది. ఈ మేరకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసినట్లు విదేశాంగ శాఖ సెక్రెటరీ ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు.
సంప్రదింపులు విఫలం..
ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న వివాదాలు, యుద్ధ వాతావరణాన్ని నియంత్రించడానికి అమెరికా మధ్యవర్తిగా వ్యవహరించింది. ఈ రెండు దేశాలతో సంప్రదింపులు నిర్వహించింది. ఆ చర్చలేవీ ఫలించలేదు. రష్యా వెనక్కి తగ్గలేదు. అదే సమయంలో తమ దేశ సైన్యాన్ని ఉక్రెయిన్ సరిహద్దులకు తరలించడం మొదలు పెట్టింది. దీనితో అమెరికా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంది. తన దేశ రాయబార కార్యలయాన్ని ఖాళీ చేయించడంతో పాటు అక్కడ నివసిస్తోన్న పౌరులను వెనక్కి పిలిపించుకుంటోంది.
కమర్షియల్ ఫ్లైట్స్..
ఆఫ్ఘనిస్తాన్ తరహాలో ప్రత్యేక విమానాలను ఏవీ ప్రస్తుతానికి అందుబాటులోకి తీసుకుని రాలేదు యూఎస్. షెడ్యూల్ కమర్షియల్ విమానాలను వినియోగించుకోవాలని ఉక్రెయిన్లో నివసించే తమదేశ పౌరులకు సూచించింది. రష్యా.. సైనిక చర్యకు దిగితే ఉక్రెయిన్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయని, పరిస్థితులు అదుపు తప్పుతాయని పేర్కొంది. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉందని, తన సైనిక బలాన్ని రష్యా మరింత పెంచుకుంటోందని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ పిసాకీ స్పష్టం చేశారు.
భారత్ హైఅలర్ట్..
కాగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న పరిణామాలతో భారత్ అప్రమత్తమైంది. అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. ఉక్రెయిన్లోని రాయబార కార్యాలయం నుంచి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెప్పించుకుంటోంది. రష్యా సైనిక చర్యకు దిగడమంటూ జరిగితే- అక్కడ ఏర్పడే పరిణామాలను అంచనా వేస్తోంది. ఈ బాధ్యతను జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్కు అప్పగించినట్లు తెలుస్తోంది.