Passport: పిల్లల పాస్పోర్ట్లపై కొత్త రూల్స్! అమెరికాలో పుట్టినా కష్టమే?
అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే ఆటోమేటిక్ పౌరసత్వం విషయంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో సంచలన నిర్ణయానికి తెరదీస్తోంది. అమెరికాలో జన్మించిన చిన్నారులకు పాస్పోర్ట్ కావాలంటే ఇకపై కేవలం వారి బర్త్ సర్టిఫికేట్ మాత్రమే సరిపోదు. దరఖాస్తు చేసుకునే సమయంలో తల్లిదండ్రులు కూడా తమ పౌరసత్వాన్ని లేదా అధికారిక ఇమ్మిగ్రేషన్ హోదాను కచ్చితంగా నిరూపించుకోవాల్సి ఉంటుందనే ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సిద్ధం చేస్తోంది.
'బర్త్ టూరిజం'కు చెక్ పెట్టడమే లక్ష్యం!
కేవలం పిల్లలకు అమెరికా పౌరసత్వం సంపాదించడం కోసమే చాలామంది విదేశీయులు గర్భవతిగా ఉన్న సమయంలో పర్యాటక వీసాలపై యూఎస్ వస్తుంటారు. దీనిని అరికట్టడానికే ట్రంప్ ప్రభుత్వం ఆగస్టు 6న ఒక ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేసింది. ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయడంలో భాగంగానే స్టేట్ డిపార్ట్మెంట్ కొత్త రూల్స్ రూపకల్పన చేస్తోంది. అమెరికన్ పౌరసత్వానికి ఉన్న విలువను కాపాడటానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ తేల్చి చెప్పారు.

ఏయే ఆధారాలు చూపించాలి?
ప్రతిపాదిత నిబంధనల ప్రకారం.. పిల్లలకు పాస్పోర్ట్ అప్లై చేసేటప్పుడు తల్లిదండ్రులు తాము అమెరికన్ పౌరులమని నిరూపించుకోవడానికి చెల్లుబాటు అయ్యే యూఎస్ పాస్పోర్ట్ లేదా బర్త్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు విదేశీయులైతే తమ ఇమ్మిగ్రేషన్ హోదాను స్పష్టం చేసే ఐ-94 (I-94) ఫారం లేదా గ్రీన్ కార్డ్ వంటి కీలక పత్రాలను చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంలో పిల్లల బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఫోటో ఐడీ మాత్రమే అడుగుతున్నారు తప్ప, తల్లిదండ్రుల పౌరసత్వానికి సంబంధించిన ప్రత్యేక ఆధారాలు అడగడం లేదు.
కోర్టు వివాదాలు.. న్యాయపోరాటాలు!
పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు ట్రంప్ గతంలో తెచ్చిన ఆదేశాలను అమెరికా సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. దీంతో ఈసారి విదేశీ దౌత్యవేత్తలు, మోసపూరిత మార్గాల్లో పౌరసత్వం పొందేందుకు వచ్చినవారు, లేదా 'బర్త్ టూరిజం' ద్వారా వచ్చిన వారి పిల్లలకు మాత్రమే పౌరసత్వాన్ని పరిమితం చేస్తూ కొత్త ఉత్తర్వులను తీసుకొచ్చారు. అయితే ఈ కొత్త ఉత్తర్వులపైనా ఇప్పటికే అమెరికా కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. మేరీల్యాండ్లోని ఫెడరల్ జడ్జి ముందు ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుండగా, ప్రభుత్వం ఇంకా అధికారికంగా నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికిప్పుడు స్టే ఇవ్వలేమని న్యాయశాఖ లాయర్లు వాదిస్తున్నారు.














Click it and Unblock the Notifications