ఆఫ్ఘనిస్తాన్పై దాడులకు అమెరికా సన్నాహాలు: ఆత్మాహూతి దాడికి ప్రతీకారం
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి అనిశ్చిత పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపిస్తోన్నాయి. కరడు గట్టిన మత ఛాందసవాదులైన తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన ఆఫ్ఘన్లో విస్తరిస్తోన్నట్లుగా భావిస్తోన్న ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి అగ్రరాజ్యం అమెరికా సమాయాత్తమౌతున్నట్లు వార్తలొస్తున్నాయి. భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లెవాంట్కు చెందిన ఆఫ్ఘనిస్తాన్ యూనిట్పై అమెరికా సైన్యం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. దీని గురించి ఆరా తీస్తోంది.
కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద..
ఐసిస్-ఖొరాసన్ ప్రావిన్స్ పేరుతో ఆఫ్ఘనిస్తాన్లో బలంగా వేళ్లూనుకుందీ ఉగ్రవాద సంస్థ. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తొలి రోజుల్లో ఆత్మాహూతి దాడులకు పాల్పడింది. భీతావహ పరిస్థితులకు కారణమైంది. రాజధాని కాబుల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఐసిస్-ఖొరాసన్ ప్రావిన్స్ జరిపిన ఆత్మాహూతి దాడి.. అప్పట్లో ఆ దేశాన్ని వణికించింది.
ఈ దాడిలో 13 మంది అమెరికన్ మెరైన్ సైనికులు సహా 180 మంది మరణించారు. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్లో ఈ దాడులు ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురి చేశాయి. ఆఫ్ఘనిస్తాన్.. ఉగ్రవాదులకు షెల్టర్ జోన్లా తయారవుతుందోనే భయాందోళనలు వెలువడ్డాయి.
ఏరివేతకు..
గత ఏడాది ఆగస్టు 26వ తేదీన చోటు చేసుకున్న ఈ దాడికి ఐసిస్-ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదులే కారణమని తేలింది. ఈ సంస్థ రిక్రూట్ చేసుకున్న అబ్దుర్ రెహ్మాన్ అల్-లొగారి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారించింది. ఆ తరువాత కూడా ఆఫ్ఘనిస్తాన్లో తరచూ దాడులకు పాల్పడుతుండటం, తాలిబన్ ప్రభుత్వాన్ని అనిశ్చితికి గురి చేస్తోండం, తన సామ్రాజ్యాన్ని క్రమంగా ఇతర ప్రావిన్స్లకు విస్తరింపజేసుకుంటోన్న నేపథ్యంలో- అమెరిక సైన్యం దృష్టి సారించింది. ఏరివేతకు దిగాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
పర్షియన్ గల్ఫ్ నుంచి..
దీనిపై న్యూయార్క్ టైమ్స్ ఓ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. ఆగస్టు 30వ తేదీ తరువాత ఆప్ఘనిస్తాన్లో అమెరికా సైన్యం ఎలాంటి ఎదురుదాడులకు దిగలేదు. ఈ దఫా పర్షియన్ గల్ఫ్ బేస్ నుంచి ఎంక్యూ-9 రీపర్ డ్రోన్స్తో ఐసిస్-కే ఉగ్రవాదులపై వైమానిక దాడులు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపింది. కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద ఆత్మాహూతి దాడికి పాల్పడిన అబ్దుర్ రెహ్మాన్ అల్-లొగారి తండ్రి.. ఢిల్లీలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థి అంటూ అప్పట్లోనే వార్తలొచ్చాయి.
ఐసిస్-కే విస్తరణ..
లొగారిని ఇదివరకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పటికీ- తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత అతణ్ని వదిలి పెట్టింది. లొగారితో పాటు పలువురు ఉగ్రవాదులను జైలు నుంచి విముక్తి కల్పించింది. జైలు నుంచి బయటికి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే లొగారీ.. ఈ దాడికి పాల్పడ్డాడు. ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతంలోని ఇతర ప్రావిన్స్లకు కూడా ఐసిస్-కే క్రమంగా విస్తరిస్తోంది. తాలిబన్ల నుంచి పెద్దగా ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకపోవడంతో ఐసిస్-కే పని మరింత సులభమౌతోందనే అంచనాలు ఉన్నాయి.
ముమ్మరంగా రిక్రూట్మెంట్స్..
ఈ నేపథ్యంలో ఇక ఉపేక్షించకూడదని అమెరికా సైన్యం నిర్ణయానికి వచ్చిందని, పక్కాగా వైమానిక దాడులు చేయడానికి వ్యూహాలు రచిస్తున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించిందని పేర్కొంది. ఐసిస్-కే రిక్రూట్మెంట్లను ముమ్మరం చేసిందని అమెరికా భావిస్తోంది. తన సంఖ్యను పెంచుకోగలిగితే- దాన్ని అడ్డుకోవడం అసాధ్యమౌతుందని, ఆరంభంలోనే అణచివేయాలని ఇంటిలెజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలిపింది.