25,000 మందికి పైగా అమెరికన్ల ప్రాణాలు పోయేవి: ట్రంప్ సంచలనం
అమెరికా ఓ భారీ ఉపద్రవం నుంచి తప్పించుకుంది.అక్రమంగా డ్రగ్స్ను తరలిస్తున్న ఓ సబ్మెరైన్ను ఆ దేశ సైన్యం పేల్చిపడేసింది. కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ స్మగ్లింగ్ ఛానల్ లో ఈ సబ్మెరైన్ ను గుర్తించింది. దీన్ని అక్కడికక్కడే ధ్వంసం చేసింది. డాలర్ల కొద్దీ విలువ చేసే మాదకద్రవ్యాల తరలింపును అడ్డుకున్నట్టయింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ విడుదల చేసింది.
బ్లాక్ అండ్ వైట్ వీడియో ఇది. సబ్మెరైన్ కదులుతుండగా.. వరుస పేలుళ్లు సంభవించడం ఇందులో స్పష్టంగా రికార్డయింది. తొలుత దాని వెనుక భాగం పేలడాన్ని చూడొచ్చు. సబ్ మెరైన్ ను ధ్వంసం చేసిన విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అమెరికాకు ఫెంటానిల్, ఇతర అక్రమ మత్తు పదార్థాలను తీసుకువస్తున్న భారీ డ్రగ్స్ సబ్మెరైన్ను ధ్వంసం చేశామని తెలిపారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు.

ఈ జలాంతర్గామిలో ప్రధానంగా ఫెంటానిల్, ఇతర మత్తు పదార్థాలు ఉన్నాయని యూఎస్ ఇంటెలిజెన్స్ ధృవీకరించిందని ఆయన తెలిపారు. ఈ పేలుడులో మరణించిన వారిని ఉగ్రవాదులతో పోల్చారు ట్రంప్. ఈ దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని, మరో ఇద్దరు సైన్యం చేతికి చిక్కారని అన్నారు. ఈ సబ్మెరైన్ తీరానికి చేరివుంటే కనీసం 25,000 మంది అమెరికన్లు చనిపోయేవారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రాణాలతో బయటపడిన ఇద్దరు ఉగ్రవాదులను వారి స్వదేశాలైన ఈక్వెడార్, కొలంబియాలకు అప్పగించి తదుపరి దర్యాప్తు చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఘటనలో అమెరికన్ సైనికులకు ఎటువంటి హాని కలగలేదని వివరించారు. రోడ్డు లేదా జల మార్గాల ద్వారా అక్రమ మత్తు పదార్థాలను తరలించే నార్కోటెర్రరిస్టులను సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నార్కోటెర్రరిజంపై ఉక్కుపాదాన్ని మోపుతామని, వీటిని అడ్డుకునే చర్యలను మరింత తీవ్రతరం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications