24న క్వాడ్ లీడర్స్ మీటింగ్: ప్రధాని మోడీ సైతం.. ఆ ఆరోపణలకు జో బైడెన్ సమాధానం
వాషింగ్టన్: కరడుగట్టిన మత ఛాందసవాదులైన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకోవడానికి కారణమైనట్టు విమర్శలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలో- అమెరికా క్వాడ్ సమ్మిట్కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో ఈ నాలుగు దేశాల అత్యున్నత సమావేశం ఏర్పాటు కానుంది. క్వాడ్ సభ్య దేశాధినేతలు, ప్రధానమంత్రులు దీనికి హాజరు కానున్నారు. సుదీర్ఘ కాలం తరువాత తొలిసారిగా ముఖాముఖిగా క్వాడ్ నేతలు సమావేశం కానున్నారు.
సుదీర్ఘకాలం తరువాత ఇన్-పర్సన్
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదిన్నరకు పైగా నిర్వహించిన అన్ని రకాల భేటీలు, సమావేశాలు, సమ్మిట్లు వీడియో కాన్ఫరెన్స్ రూపంలో కొనసాగాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతుండటంతో ఆ భయాలు తొలగిపోయాయి. అంతర్జాతీయ స్థాయి సమ్మిట్స్ ఇక ముఖాముఖిగా ఏర్పాటవుతున్నాయి. జో బైడెన్, నరేంద్ర మోడీ సైతం తొలిసారిగా వన్ టు వన్ సమావేశం కానున్నారు.
PoonamBajwa: థైస్ అందాలతో రెచ్చిపోతున్న నాగ్ హీరోయిన్..
2019 తరువాత తొలిసారిగా అమెరికాకు మోడీ..
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలను స్వీకరించిన తరువాత- నరేంద్ర మోడీ ఆయనను కలుసుకోవడం ఇదే తొలిసారి అవుతుంది. ఇప్పటిదాకా వర్చువల్ విధానంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో కలుసుకున్నప్పటికీ.. ఇన్-పర్సన్ భేటీ కావడం ఇదే తొలిసారి. మార్చిలో క్వాడ్ మీటింగ్, ఏప్రిల్లో వాతావరణ మార్పులు, జూన్లో జీ-7 సదస్సులో వర్చువల్ విధానంలోనే కొనసాగాయి. కాగా- 2019 తరువాత నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. 2019 సెప్టెంబర్లో ఆయన అమెరికా వెళ్లారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలిశారు. ట్రంప్తో కలిసి హౌడీ మోడీ ఈవెంట్లోనూ పాల్గొన్నారు.
అమెరికా సైన్యం ఉపసంహరణపై
అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే తాలిబన్లు పేట్రేగిపోయారు. పంజ్షీర్ ప్రావిన్స్ మినహా దేశం మొత్తాన్నీ ఆక్రమించుకున్నారు. రేపో, మాపో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచ దేశాలన్నింటినీ కలవరపాటుకు గురి చేసింది ఈ పరిణామం. తాలిబన్ల పరిపాలనలో ఆప్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు షెల్టర్ జోన్గా మారుతుందనే భయాందోళనలు భారత్, అమెరికా సహా అన్ని దేశాల్లోనూ వ్యక్తం అయ్యాయి.
మరోసారి క్లారిటీ..
దీనికి కారణం- అమెరికా తన సైనిక బలగాలను ఉపసంహరించుకోవడమేననే ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటన్నింటికీ ఇదివరకే జో బైడెన్ ఓ సారి సమాధానం ఇచ్చారు కూడా. సైనిక బలగాల ఉపసంహరణ పూర్తయిన తరువాత- జో బైడెన్ తన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆప్ఘనిస్తాన్ నుంచి సైన్యాన్ని వెనక్కి పిలిపించడానికి గల కారణాలను వివరించారు. ఈ సారి క్వాడ్ మీటింగ్ వేదికగా- మరోసారి ఇదే అంశాన్ని ఆయన ప్రస్తావిస్తారని తెలుస్తోంది.
వాతావరణ మార్పు.. ఉగ్రవాదం
జో బైడెన్ సారథ్యంలో ఏర్పాటయ్యే ఈ సమ్మిట్లో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జపాన్, ఆస్ట్రేలియా ప్రధానమంత్రులు యోషిహిడె సుగ, స్కాట్ మోరిస్ హాజరవుతారు. 21వ శతాబ్దంలో ఎదురయ్య సవాళ్లను ఎదుర్కొనడానికి ఆసియా-పసిఫిక్ దేశాల సహకారం అత్యవసరమని తాము భావిస్తున్నామని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ పిసాకీ తెలిపారు. వాతావరణ మార్పులు సహా ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఆప్ఘనిస్తాన్ పరిణామాలుఈ భేటీలో ప్రస్తావనకు వస్తాయని చెప్పారు.
ఐరాస సర్వసభ్య సమావేశంలో
క్వాడ్ మీటింగ్ ముగిసిన మరుసటి రోజే- ప్రధాని మోడీ 76వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కరోనా వైరస్ నిర్మూలన, వ్యాక్సినేషన్, భారత్కు చెందిన కొన్ని ఫార్మాసూటికల్స్ కంపెనీలు వ్యాక్సిన్ను అభివృద్ధి చేయడం, ఆత్మనిర్భర్ భారత్ వంటి అంశాలపై ప్రధాని ప్రసంగిస్తారు. దీనితో ఆప్ఘనిస్తాన్ పరిణామాలు, తాలిబన్లకు పాకిస్తాన్ సహాయం చేస్తోందనే విషయాన్ని సైతం మోడీ లేవనెత్తే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.