ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వర్క్ ఫ్రమ్ హోమ్.. మోడీ పొదుపుసూత్రాలు ఏపీలో అమలు!
తెలంగాణలో ఇటీవల పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన పొదుపు సూత్రాలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగి దేశం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని, ఇంధనం ఆదా చేయడం జాతీయ కర్తవ్యమని మోడీ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా భవిష్యత్ లో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
మోదీ సూచించిన పొదుపు అంశాలపై చంద్రబాబు ఏమన్నారంటే
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సూచించిన వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH), సోలార్ ఎనర్జీ, స్థానిక పర్యాటకం, అనవసర విదేశీ ప్రయాణాలు తగ్గించడం వంటి పొదుపు చర్యలను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో కిమ్స్ ఆసుపత్రి మరియు వైద్య విశ్వవిద్యాలయం భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసిన సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ను ప్రోత్సహిస్తామన్నారు.

విదేశీ పర్యటనలు, సోలార్ ఎనర్జీపై చంద్రబాబు చెప్పిందిదే
10 కార్ల కాన్వాయ్లు, అనవసరమైన విదేశీ పర్యటనలు తగ్గించాలని సీఎం చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. మన దేశంలోని అందమైన పర్యాటక కేంద్రాలను ప్రోత్సహించాలి" అని వ్యాఖ్యానించారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచాలని, ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ రూఫ్టాప్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇంధన ఆదా ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు, పర్యావరణ రక్షణ కూడా సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు.
ఏపీ ఆర్ధిక స్వయం సమృద్ధి సాధించేలా సీఎం ఆలోచన
ఈ పొదుపు చర్యలు భవిష్యత్ ఆంధ్ర ప్రదేశ్ లో అమలు చేయడం ద్వారా రాష్ట్రం మరింత ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏపీలో ఈ పొడుపు సూత్రాలను అమలు చేసి ఆర్ధిక భారాన్ని తగ్గించి ముందడుగు వెయ్యాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే నేడు ఈ అంశాలపై అమరావతి వేదికగా వ్యాఖ్యలు చేశారు.













Click it and Unblock the Notifications