యూఎస్ ఎన్నికల ఎఫెక్ట్: రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుదల. కోటికి చేరువలో!
వాషింగ్టన్: అమెరికాలో ఎన్నికలు ముగిసి, ఓట్ల లెక్కింపు జరుగుతున్న వేళ కరోనా మహమ్మారి విజృంభించింది. రికార్డు స్థాయిలో అమెరికా వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లోనే 99వేలకు పైగా కొత్త కోవిడ్ 19 కేసులు నమోదైనట్లు హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.
అమెరికాలో 99వేలకు పైగా కొత్త కరోనా కేసులు
బుధవారం రాత్రి నాటికి అక్కడ 99,660 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1112 మంది కరోనా బారినపడి మరణించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగిన మరుసటి రోజే ఈ కేసులు బయటపడ్డాయి. అమెరికాలో ఇప్పటి వరకు 94 లక్షల మంది కరోనా బారినపడగా, 2,33,000 మరణాలు సంభవించాయి.
ఎన్నికల అస్త్రంగా మారిన కరోనా కట్టడి
కరోనా మహమ్మారి తొలి నాటి నుంచి అమెరికా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ కరోనా కట్టడి ప్రధానాంశంగా మారింది. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ఈ విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. కరోనా కట్టడిలో డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని బైడెన్ ఆరోపించారు. ట్రంప్ నిర్లక్ష్యం వల్లే లక్షలాది మంది అమెరికన్లు కరోనా బారినపడ్డారని, అనేక వేల మంది ప్రాణాలు కోల్పోయారని బైడెన్ ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడి విషయంపై ప్రజలు కూడా డొనాల్డ్ ట్రంప్పై అసంతృప్తితోనే ఉన్నారని ప్రస్తుతం వెల్లడవుతున్న ఫలితాలు చెబుతున్నాయి.
కరోనా ఎఫెక్ట్: 10 కోట్ల అమెరికన్లు ముందస్తు ఓట్లు
అక్టోబర్ మధ్య నుంచి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర, మిడ్వెస్ట్లో కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. శీతాకాలపు ఫ్లూ సీజన్ దూసుకుపోతున్నందున కొన్ని రాష్ట్రాల్లోని ఆరోగ్య అధికారులు ఆసుపత్రిలో ప్రవేశించగల సామర్థ్యం గురించి ఇప్పటికే హెచ్చరికలు చేశారు. ఈ మహమ్మారి అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది, వృద్ధిలో చారిత్రాత్మక సంకోచానికి, పదిలక్షల ఉద్యోగ నష్టాలకు కారణమైంది.
అంతేగాక, కరోనా యూఎస్ ఎన్నికలను కూడా ప్రభావితం చేసింది, 100 మిలియన్ల మంది ఓటర్లు మంగళవారం ఎన్నికల రోజుకు ముందు మెయిల్ ద్వారా లేదా వ్యక్తిగతంగా తమ బ్యాలెట్ను వేశారు. కాగా, ఇది ఇప్పటివరకు ప్రారంభ ఓటర్లలో అత్యధిక సంఖ్య కావడం గమనార్హం.