అమెరికా: అబార్షన్ హక్కును రద్దు చేసిన రోజున క్లినిక్లో వాతావరణం ఎలా ఉందంటే...
ఆర్కాన్సస్ రాష్ట్రం లిటిల్ రాక్లోని అబార్షన్ క్లినిక్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం ఉదయం అమెరికాలోని సుప్రీం కోర్టు అబార్షన్ చట్టబద్దతను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. 50 ఏళ్ల నాటి రో వర్సెస్ వేడ్ కేసులో వెలువడిన తీర్పును రద్దు చేసింది.
ఆ క్షణం లిటిల్ రాక్ క్లినిక్లో అంతా తలకిందులైపోయింది. పేషెంట్ ఏరియా తలుపులు ఒక్కసారిగా మూసుకున్నాయి. తలుపుల వెనుక ఏడుపులు వినిపిస్తున్నాయి.
బీబీసీ గత మూడు వారాలలో లిటిల్ రాక్ ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్ క్లినిక్లోని సిబ్బందిని, రోగులను ఇంటర్వ్యూ చేసింది.
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే బీబీసీని బయటకు పంపించేశారు. ఈ నిర్ణయాన్ని జీర్ణం చేసుకోవడానికి వారికి కొంత సమయం కావాలి. అందుకే, మమ్మల్ని వెళ్లిపొమ్మన్నారు.
క్లినిక్ బయట అప్పుడప్పుడు అబార్షన్ వ్యతిరేక నిరసనకారులు గుమికూడుతుంటారు. వారి నుంచి క్లినిక్కుకు వచ్చే మహిళలను తప్పిస్తూ, జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లే సహాయకులు (ఎస్కార్ట్స్) అందరూ గుంపుగా వాటేసుకున్నారు.
"ఈ దేశం ప్రజల పట్ల శ్రద్ధ వహిస్తుందని, మహిళల గురించి పట్టించుకుంటుందని భావించాను" అని ప్రధాన ఎస్కార్ట్ మిస్ కరెన్ అన్నారు.
సంబరాలు చేసుకున్న అబార్షన్ వ్యతిరేకులు
బయట యాంటి-అబార్షన్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. ఇంకా చాలా మార్పు రావాల్సి ఉందని అన్నారు.
"ఇది వేడుక చేసుకోవాల్సిన రోజు. కానీ మా దేశం నుంచి అబార్షన్ను పూర్తిగా నిర్మూలించిన నాడే నిజమైన వేడుక చేసుకుంటాం" అని హోయ్ట్ ప్లంకెట్ బీబీసీతో అన్నారు.
క్లినిక్కు ఇంకా జనం వస్తున్నారు. బహుసా వాళ్లు తీర్పు విని ఉండరు. అలాంటి వారిని చూసి "మీ పేరు నోటు చేసుకున్నాం" అని యాంటీ-అబార్షన్ మద్దతుదారుల్లో ఒకరు అరిచారు.
"మీలాంటి వారికి నేనిచ్చే సలహా ఏంటంటే, ఈ పాపపు దేశాన్ని, అసమానతలు, దుర్మార్గం పేరుకుపోయిన ప్రదేశాన్ని విడిచివెళ్లిపోండి" అని వ్యంగ్యంగా అరిచారు.
అమెరికాలో పలు చోట్ల అబార్షన్ క్లినిక్కులు మూసివేస్తున్నారు. ఆర్కాన్సస్ సహా మరో 13 రాష్ట్రాలు "ట్రిగ్గర్ లా" అమలు చేశాయి. దీని కింద 30 రోజుల లోపు అబార్షన్ను నిషేధించాల్సి ఉంటుంది.
అబార్షన్ను నియంత్రించే అధికారం రాష్ట్రాలకు ఇస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం తీర్పు వెలువరించినప్పుడు, ఈ ట్రిగ్గర్ చట్టాలు అమలులోకి రావడం ప్రారంభించాయి.
టెక్సస్ లాంటి రాష్ట్రాలు వెయిటింగ్ పీరియడ్ను చట్టాల్లో చొప్పించాయి.
ఆర్కాన్సస్ రిపబ్లికన్ అటార్నీ జనరల్ లెస్లీ రూట్లెడ్జ్ బీబీసీతో మాట్లాడుతూ, ట్రిగ్గర్ చట్టానికి, సుప్రీం కోర్టు నిర్ణయానికి మద్దతిస్తున్నట్లు తెలిపారు.
"మా జీవితకాలంలో ఇది జరుగుతుందని మాలో చాలామంది ఊహించలేదు" అని ఆమె అన్నారు.
ప్రస్తుతం తల్లి ప్రాణాలను కాపాడేందుకు మాత్రమే అబార్షన్ను చట్టబద్ధం చేశారు. అత్యాచారం, అక్రమ సంబంధాలకు మినహాయింపులు లేవు.
"మనం ఒక అమాయకపు ప్రాణం గురించి మాట్లాడుకుంటున్నాం. అక్రమ సంబంధాల కారణంగా కడుపులో పురుడు పోసుకునే బిడ్డకు ఆ పాపం అంటదు" అని రూట్లెడ్జ్ అన్నారు.
ఆర్కాన్సస్లో ప్రజలకు అవాంఛిత గర్భం తొలగించుకునేందుకు ఇప్పుడు ఒక్కటే మార్గం. రాష్ట్రం బయటికెళ్లి అబార్షన్ చేయించుకోవాలి లేదా బిడ్డకు జన్మనివ్వాలి.
- అత్యాచార బాధితులు 26వ వారంలో అబార్షన్ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వడం సురక్షితమేనా
- గర్భస్రావం చేయించుకునే హక్కు విషయంలో అమెరికా కంటే భారత్ మెరుగ్గా ఉందా?
'మహిళలు తమ హక్కును కోల్పోతున్నారు'
లిటిల్ రాక్ క్లినిక్లో సిబ్బంది తమ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న మహిళలకు ఫోన్ చేసి రావద్దొని చెప్పారు. వేరే రాష్ట్రాల్లో అపాయింట్మెంట్ తీసుకునేందుకు సహాయం చేశారు.
అక్కడ నర్స్గా పనిచేస్తున్న ఆష్లీ హంట్ కన్నీటి పర్యంతమయ్యారు.
"ఈ వార్త వినాల్సి వస్తుందని ముందే తెలిసినా, అది విన్న క్షణం తీవ్ర వేదన కలుగుతుంది. అపాయింట్మెంట్ తీసుకున్న మహిళలకు ఫోన్ చేసి కోర్టు తీర్పు గురించి చెప్పడం చాలా బాధ. హృదయం ముక్కలైపోతుంది" అని ఆష్లీ అన్నారు.
ఆ క్లినిక్కులో ఆమె 14 ఏళ్లుగా పనిచేస్తున్నారు. మహిళలు తమ హక్కును కోల్పోతున్నందుకు బాధగా ఉందని, తనకు వ్యక్తిగతంగా ఇది వేదన మిగిల్చిందని ఆమె వాపోయారు.
"ఆ మహిళల హక్కులే కాదు, నా హక్కులు కూడా లాగేసుకున్నట్లు అనిపిస్తోంది" అన్నారు.
జెనిఫర్ థాంప్సన్ పదేళ్ల కిందట ఈ క్లినిక్కు వచ్చి అబార్షన్ చేయించుకున్నారు. తరువాత, అదే క్లినిక్కులో సిబ్బందిగా చేరారు. ఈ ఆస్పత్రి తన జీవితాన్ని కాపాడిందని ఆమె అన్నారు. ఈ క్లినిక్కు తనను ఎంతో ఆదరించిందని, ఉద్యోగం ఇచ్చి మరో జీవితాన్ని ప్రసాదించిందని చెప్పారు.
కోర్టు తీర్పు విన్నాక తన హృదయం ముక్కలైపోయిందని, చాలా నిరాశ కలిగిందని, ఇకపై తనలాంటి మహిళలకు తాను సహాయం చేయలేనని జెనిఫర్ వాపోయారు.
"వాళ్లకు సారీ చెప్పాలి...సారీ, నేను మీకింకేం సహాయం చేయలేను. సారీ, మీ బాయ్ఫ్రెండు మిమ్మల్ని రోజూ కొట్టినా, రోజూ మీపై అత్యాచారం చేసినా నేను ఏమీ చేయలేను. మీరు మరో చోటు వెతుక్కోవాల్సిందే అని వాళ్లకు చెప్పాలి.
వాళ్లకు కొంత సమాచారం అందించగలను. అదొక్కటే నేను చేయగలిగే సహాయం. నిజంగా, హృదయ బద్దలైపోతోంది. ఈ క్లినిక్కు నన్ను చాలాసార్లు కాపాడింది" అంటూ జెనిఫర్ బాధపడ్డారు.
శుక్రవారం సాయంత్రం, సుప్రీం కోర్టు తీర్పును నిరసిస్తూ సుమారు 1,000 మంది స్టేట్ హౌస్ బయట గుమికూడారు. లిటిల్ రాక్ క్లినిక్కులోని ఒక ఎస్కార్ట్ కూడా ఈ నిరసనల్లో పాలుపంచుకున్నారు.
"ఈరోజు ఏడ్చినా, రేపు మేం పోరాడతాం" అన్నారామె.
ఇవి కూడా చదవండి:
- అగ్నిపథ్: సైన్యంలో ఉద్యోగాల కోసం పుట్టుకొచ్చిన కోచింగ్ సెంటర్లు, విద్యార్థుల కలలు కల్లలేనా
- అమెరికా: అబార్షన్ను చట్టబద్ధం చేసిన 50 ఏళ్ళ నాటి తీర్పును కొట్టేసిన సుప్రీం కోర్టు
- రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నవారికి, తీసుకోని వారికి కరోనావైరస్ లక్షణాలలో ప్రధాన తేడా అదే
- మహారాష్ట్ర రిసార్ట్ రాజకీయాలు: ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఇలాంటివి జరిగాయా? ఈ లగ్జరీ హోటళ్లలో ఎమ్మెల్యేలు ఏం చేస్తారు
- బీజేపీ హిందుత్వ విధానంతో ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వ పోటీపడలేకపోయిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)