కీలక ముందడుగు: మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ నిర్ణయం, కానీ...
లండన్: భారతీయ బ్యాంకులకు రూ.9వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి బ్రిటన్ పారిపోయిన విజయ్ మాల్యా కేసులో కీలక ముందడుగు. ఆయనను భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ నిర్ణయం తీసుకుంది.
మాల్యాను భారత్కు తిరిగి అప్పగించేందుకు యూకే హోంమంత్రిత్వ శాఖ అంగీకరించింది. అదే సమయంలో దీనిపై అక్కడ హైకోర్టుకు అప్పీలు చేసుకునేందుకు విజయ మాల్యాకు హోంశాఖ 14 రోజుల గడువు ఇచ్చింది.
గతంలో విచారణ జరిపిన కింది కోర్టు మాల్యాను భారత్కు అప్పగించవచ్చునని చెప్పింది. ఈ ఆదేశాలను హోంశాఖకు పంపించింది. ఇతర దేశాలకు చెందిన వారు ఆయా దేశాల్లో నేరాలు చేసి ఇంగ్లాండ్లో ఆశ్రయం పొందితే వారిని వారి దేశాలకు పంపించేందుకు వీలుగా కోర్టులు హోంశాఖకు ఆదేశాలు జారీ చేస్తాయి. మాల్యా కేసులోనూ భాగంగా హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఆర్థిక నేరగాళ్లను కట్టడి చేసే విధానంలో భాగంగా మోడీ ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చింది. దీని ప్రకారం మాల్యాను పరారీ ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది.