రక్తసిక్తం: అట్టుడుకుతోన్న వాషింగ్టన్: పార్లమెంట్ భవనం ముట్టడి: కాల్పుల మోత: అల్లకల్లోలం
వాషింగ్టన్: అమెరికాలో అధికార మార్పిడి గడువు సమీపిస్తోన్న కొద్దీ హింసాత్మక వాతావరణం నెలకొంటోంది. అగ్రరాజ్యం అమెరికా రాజధాని అట్టుడికిపోతోంది. ఈ నెల 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ప్రమాణ స్వీకారం చేయాల్సిన నేపథ్యంలో రాజధానిలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. వందల్లో కాదు.. వేలాది మంది రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు రక్తసిక్తం అయ్యాయి. ప్రదర్శనకారులను అడ్డుకోవడానికి పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు.
పార్లమెంట్లో సమావేశాల సందర్భంగా..
ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ డొనాల్డ్ ట్రంప్.. ఆయన మద్దతుదారులు మొదటి నుంచీ వాదిస్తూనే వస్తున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. ఎలక్టోరల్ కాలేజ్ సైతం డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయినట్టు ప్రకటించింది. కొత్త అధ్యక్షుడిగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ పేరును అధికారికంగా ప్రకటించింది. దీన్ని అమెరికా కాంగ్రెస్, సెనెట్ లాంఛనప్రాయంగా ఆమోదించాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు యూఎస్ కాంగ్రెస్ సమక్షానికి వచ్చాయి.
ట్రంప్ మద్దతుదారుల నిరసన..
ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు తమ నిరసనలను తెలియజేయడానికి వాషింగ్టన్లో భారీ ర్యాలీని నిర్వహించారు. వేలాదిమంది ఇందులో పాల్గొన్నారు. వారంతా ప్రదర్శనగా యూఎస్ పార్లమెంట్ భవనం..కేపిటల్ బిల్డింగ్ వైపు దూసుకెళ్లారు. కేపిటల్ బిల్డింగ్ వద్ద ప్రదర్శన బైఠాయించిన అనంతరం ఉన్నట్టుండి ముట్టడించారు. ఒక్కసారిగా పార్లమెంట్ భవనంలోనికి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. వారికి అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన రెండంచెల భద్రతను అధిగమించారు. బ్యారికేడ్లు, గేట్లను ఎక్కి, పార్లమెంట్ భవనం ఆవరణలోకి ప్రవేశించారు.
పోలీసుల కాల్పుల్లో..
ఆందోళనకారులను నిలువరించడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారు ఎదురుదాడికి దిగడంలో పోలీసులు కాల్పులు జరిపారు. తొలుత- దట్టమైన, ఘాటు పొగను వెలువడించే స్మోక్ గ్రెనేడ్లను విసిరారు. గాలిలో కాల్పులు జరిపారు. పోలీసు వాహనాల సైరన్ మోతలు, కాల్పులు, ఆందోళనకారుల నినాదాలతో పార్లమెంట్ భవనం అల్లకల్లోలంగా తయారైంది. అయినప్పటికీ- వారు వెనక్కి తగ్గలేదు. మరింత రెచ్చిపోయారు. దీనితో నేరుగా ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఓ మహిళ మరణించారు. ఈ విషయాన్ని వాషింగ్టన్ డీసీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించారు.
ట్రంప్, బిడెన్ సహా
ఈ ఘటన పట్ల అమెరికా దేశాధినేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అనూహ్య చర్యగా డొనాల్డ్ ట్రంప్, కొత్త అధ్యక్షుడు జో బిడెన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వ్యాఖ్యానించారు. ప్రజా తీర్పును అవమానించినట్టయిందని జో బిడెన్ అన్నారు. తన మద్దతుదారులు శాంతియుతంగా వ్యవహరించాలని, వెనక్కి తగ్గాలని ట్రంప్ సూచించారు. హింసాత్మకంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్.. వెంటనే దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలని, ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చే బాధ్యత ఆయనదేనని అన్నారు. రిపబ్లికన్ పార్టీ సెనెటర్లు, కాంగ్రెస్ సభ్యులు.. ఈ అల్లర్లను తమ బాధ్యతను స్వీకరించాల్సి ఉంటుందని సూచించారు.












Click it and Unblock the Notifications