‘మేం పిగ్గీ బ్యాంకులమా? దోచుకోవడానికి..’: ఇండియాపై ట్రంప్ అక్కసు
Recommended Video
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు. అమెరికా వస్తువులపై భారత్ 100శాతం సుంకాన్ని వసూలు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
దోచుకుంనేందుకు ప్రయత్నిస్తే..
అంతేగాక, అమెరికాను దోచుకునేందుకు ప్రయత్నించే దేశాలతో అవసరమైతే వాణిజ్య సంబంధాలను తెంచుకునేందుకు సైతం వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరించారు. సోమవారం జరిగిన జీ-7 దేశాధినేతల సంయుక్త ప్రకటన నుంచి వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.
‘మేమేమన్నా పిగ్గీ బ్యాంకులమా?
ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. పలు దేశాలు అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వాణిజ్య పన్నులు అధికంగా వసూలు చేస్తున్నాయని అన్నారు. ‘మేమేమన్నా పిగ్గీ బ్యాంకులమా?.. అందరూ మమ్మల్ని దోచుకోవాలని చూస్తున్నారు. అమెరికా సంపదకు నష్టం వాటిల్లే విధంగా ఉంటే ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను తెంచుకుంటాం' అని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
మేమిలా ఉంటే..
అధిక సుంకాలు వసూలు చేస్తున్న దేశాల గురించి ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్లో మా వస్తువులపై వందశాతం సుంకాన్ని విధిస్తున్నారు. కానీ, మేం విధించడం లేదు. మేం అలా వసూలు చెయ్యలేకపోతున్నాం. అందుకే వివిధ దేశాలతో మాట్లాడుతున్నాం' అని చెప్పారు.
మండిపడ్డ ట్రంప్
కాగా, అమెరికా నుంచి దిగుమతి అవుతున్న హార్లీడేవిడ్సన్ బైకులపై భారత్ అధిక శాతం పన్నులు వసూలు చేస్తుందని గతంలోనే ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వలస విధానాలపై కూడా కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ ప్రభుత్వ నేతృత్వంలోని అమెరికా.. భారత్ తోపాటు ఇతర దేశాలతోనూ వాణిజ్య బంధాలు అంతంత మాత్రంగానే నిర్వహిస్తోంది.