Whats APP news: 1 జనవరి 2020 నుంచి ఈ స్మార్ట్ ఫోన్లపై వాట్సాప్ కట్
ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రతి ఒక్కరి జీవితంతో ముడిపడిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ లేకుండా జనాలు ఉండలేకున్నారు. అంతలా ఈ మెసేజింగ్ యాప్ జీవితాలతో పెనేసుకుపోయింది. తాజాగా ఓ వార్త మాత్రం వాట్సాప్ యూజర్లను కలవరపెడుతోంది. డిసెంబర్ 31 తర్వాత కొన్ని స్మార్ట్ఫోన్లపై వాట్సాప్ పనిచేయదని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ప్రతి స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ పనిచేస్తుంది. అయితే డిసెంబర్ 31 తర్వాత కొన్ని స్మార్ట్ ఫోన్లపై ఈ మెసేజింగ్ యాప్ పనిచేయదట.
వచ్చే ఏడాది నుంచి కొన్ని స్మార్ట్ ఫోన్లపై వాట్సాప్ పనిచేయదు. ఇందుకు కారణం కూడా యాజమాన్యం చెబుతోంది. ఔట్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టంను వినియోగిస్తున్న స్మార్ట్ఫోన్లపై ఇక వాట్సాప్ పనిచేయదని యాజమాన్యం స్పష్టం చేసింది. ఇక పాత ఓఎస్లపై వాట్సాప్ సపోర్టు చేయకుండా డెవలపర్స్ చేశారు. కొత్త ఫీచర్లను ఆ పాత ఆపరేటింగ్ సిస్టం సపోర్టు చేయని కారణంగా మొత్తానికే తొలగిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. సాధారణంగా పాత ఆపరేటింగ్ సిస్టంలపై కూడా కొత్త వాట్సాప్ ఫీచర్లు పనిచేసేలా డెవలపర్స్ డిజైన్ చేసేవారు. కానీ ఇది అదనంగా భారం అవుతుండటంతో ఇక దానిపై దృష్టి సారించకూడదని డిసైడ్ అయ్యారు.
డిసెంబర్ 31 తర్వాత విండోస్ ఫోన్లపై వాట్సాప్ అప్లికేషన్ పనిచేయదని సంస్థ తెలిపింది. దీంతో నోకియా లూమియా డివైస్లపై వాట్సాప్ ఇక పనిచేయదని స్పష్టం చేసింది. ఈ ఫోన్లు విండోస్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తున్నాయి. విండోస్ ఫోన్లపై వాట్సాప్ బంద్ అయ్యాక ఆండ్రాయిడ్ పాత వెర్షన్లు అంటే 2.3.7 వెర్షన్లపై కూడా వాట్సాప్ సపోర్ట్ చేయకుండా చేస్తామని యాజమాన్యం తెలిపింది. ఇది ఫిబ్రవరి 2020 నుంచి అమలు చేయడం జరుగుతుందని వివరించింది. అంటే వాట్సాప్ ఫోన్లో ఉన్నప్పటికీ మెసేజ్లు పంపాలన్న జరగదు.. పంపిన మెసేజ్లు చూసుకునేందుకు వీలుపడదని స్పష్టం చేసింది. అంతేకాదు ఐఓఎస్8 పై పనిచేస్తున్న ఐఫోన్లలో కూడా వాట్సాప్ పనిచేయదని డెవలపర్స్ చెప్పారు. ఇప్పటికే ఈ వెర్షన్లు కలిగి ఉన్న ఫోన్లలో కొత్త ఫీచర్లు ఇన్స్టాల్ చేసుకోలేము.
పాత ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తున్న స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ సదుపాయం కట్ చేయాలన్న నిర్ణయం కఠినమైనదే అయినప్పటికీ తీసుకోక తప్పలేదని యాజమాన్యం చెబుతోంది. మెజార్టీ వినియోగదారులు లేటెస్ట్ వెర్షన్ ఆపరేటింగ్ సిస్టంలు కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారని అలాంటి వారికి ఇబ్బందులు కలగకూడదన్న కారణంతోనే పాత స్మార్ట్ ఫోన్లకు చెక్ పెట్టామని వాట్సాప్ యాజమాన్యం వివరించింది.