వదంతులు నమ్మొద్దు... ప్రజలు అప్రమత్తతో ఉండాలి: కోవిడ్-19పై ప్రపంచ ఆరోగ్య సంస్థ
యూఎన్: ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనావైరస్పై ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన విడుదల చేసింది. కరోనావైరస్పై వదంతులు పుట్టించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అదే సమయంలో ప్రజలు కూడా అప్రమత్తతతో వ్యవహరించాలని కోరింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 95265 కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్ చెప్పారు. కోవిడ్-19 బారిన పడి 3వేలకు పైగా మృతి చెందారని వెల్లడించారు. గత 24 గంటల్లో చైనాలో 130 కేసులు నమోదయ్యాయని ఇవన్నీ ఎక్కువగా హూబే ప్రావిన్స్లోనే బయటపడ్డాయని వెల్లడించారు. చైనాకు వెలుపల 2వేలకు పైగా కేసులు నమోదైనట్లు డాక్టర్ టెడ్రాస్ చెప్పారు. కొరియాలో కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని ఇది మంచి పరిణామం అని అన్నారు.
హాంగ్కాంగ్లో ఓ కుక్కకు కరోనావైరస్ వచ్చిందని ధృవీకరించారు. అయితే చికిత్స అందిస్తున్నామని డాక్టర్ వాన్ కర్కోవ్ చెప్పారు. ఇదిలా ఉంటే జంతువుల నుంచి మనుషులకు సోకిందనేదానిపై పూర్తి ఆధారాలు లేవని చెప్పారు. అయితే జంతువులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వైరస్ గురించి డిసెంబర్లోనే తెలిసిందని అయితే ఇది భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడే చెప్పలేమని చెప్పారు. అయితే వాతావరణంలో మార్పులపై కూడా కరోనావైరస్ ఆధారపడి ఉంటుందని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒక్కో దేశంలో ఒక్కోలా కరోనావైరస్ దాడి చేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు చెప్పారు.
అన్ని దేశాల ఆరోగ్యమంత్రిత్వ శాఖలు చాలా అప్రమత్తతతో వ్యవహరిస్తున్నాయని డాక్టర్ టెడ్రాస్ చెప్పారు. అయితే ప్రభుత్వాల కంటే ముందు ఈ మహమ్మారిపై పోరుకు ప్రజలు తమ వంతు పాత్ర పోషించాలని పిలుపు నిచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇక కరోనావైరస్ విజృంభిస్తున్న దేశాలకు అన్ని విధాల సహకారం అందిస్తున్నామని వెల్లడించారు. దక్షిణ కొరియా ఆరోగ్యశాఖ మంత్రితో కూడా మాట్లాడినట్లు చెప్పామని వారు కూడా ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధమని పేర్కొన్నట్లు డాక్టర్ టెడ్రాస్ చెప్పారు.
ఇక ఈ వైరస్లు ఎంతకాలం జీవించి ఉంటాయనేదానిపై కూడా పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. అయితే పరిసరాలను డిసిన్ఫెక్టెంట్స్తో క్లీన్ చేస్తే వైరస్లు ఉండవని అధికారులు చెప్పారు. ఇక మనుషుల నుంచి మనుషులకు కూడా ఇది సోకుతుంది. అయితే మనుషుల నుంచి మనుషులకు ఎంతమందికి సోకిందనేదానిపై విశ్లేషణ చేస్తున్నట్లు వెల్లడించారు. చైనాలో వచ్చినందున అన్ని దేశాలకు రావాలని కోరుకోకూడదని సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తూ ఇతరులకు జాగ్రత్తలు చెబుతూ ముందుకు వెళ్లాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.