Monkeypox: స్వలింగ సంపర్కం యమడేంజర్: వేలల్లో పాజిటివ్ కేసులు: డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్
జెనీవా: ప్రమాదకరమైన మంకీపాక్స్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. పలు దేశాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తోన్నాయి. ఇప్పటికే భారత్లో కూడా అడుగు పెట్టింది. ఈ మహమ్మారి తొలి కేసు కేరళలో వెలుగులోకి వచ్చింది. రెండో పాజిటివ్ కేసు కూడా అక్కడే నమోదైంది. మంకీపాక్స్ వైరస్ విస్తరణపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం జారీ చేసింది.
ఇటు ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి పూర్తిగా నిర్మూలన కావట్లేదు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం ఉదయం జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. 24 గంటల వ్యవధిలో కొత్తగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20,557గా నమోదైంది. 18,517 మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. 40 మంది మరణించారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,654కు చేరింది. పాజిటివిటీ రేటు 4.138 శాతంగా నమోదైంది.
ఈ పరిస్థితుల మధ్య మంకీపాక్స్ కూడా భారత్కు విస్తరించడం మొదలు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా 14,000 మంకీపాక్స్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆఫ్రిక దేశాల్లో అయిదు మంది మృత్యువాత పడినట్లు స్పష్టం చేసింది. ఈ 14,000 కేసుల్లో అత్యధికం యూరప్ దేశాల్లో వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. పురుషులు..పురుషులతో సెక్స్ చేయడం వంటి పరిణామాలతో మంకీపాక్స్ మరింత బలపడుతోందని పేర్కొంది.
మంకీపాక్స్ కేసులు విస్తరించకుండా అన్ని దేశాలను అప్రమత్తం చేశామని ప్రపంచ ఆరోగ్య సంస్థ టెడ్రొస్ అథనామ్ ఘెబ్రెయెసుస్ తెలిపారు. మంకీపాక్స్ విస్తరిస్తోన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ నిర్వహించిన రెండో అత్యున్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఇంటర్నేషనల్ కన్సర్న్ పేరిట ఈ భేటీ ఏర్పాటైంది. మంకీపాక్స్ విస్తరణను అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలతో కూడిన ఓ నివేదికను ఇందులో ఆమోదించారు.
దేశంలో మంకీపాక్స్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే విడుదల చేసింది. ప్రత్యేకించి- విమాన ప్రయాణికులపై ఆంక్షలను విధించింది. ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణం చేసే వారు- అనారోగ్యానికి గురైన వారిని, శరీరంపై గాయాలు ఉన్న వారిని కలుసుకోకూడదని సూచించింది. అటవీ జంతువులతో పాటు ఎలుకలు, ఉడతలు, కోతుల జీవించి ఉన్నా లేదా మరణించినా ఆ పరిసరాల్లో ఉండకూడదని పేర్కొంది.