rishi sunak ప్రస్థానం: వెయిటర్ నుంచి బ్రిటన్ ప్రధాని వరకు, అంచెలంచెలుగా
లండన్: భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నిక చరిత్రను తిరగరాశారు. మొదట రన్నరప్గా నిలవడం నుంచి కేవలం రెండు నెలల్లోనే యూకే మొదటి భారతీయ సంతతికి చెందిన ప్రధాన మంత్రి అయ్యే వరకు.. రిషి సునాక్ తన చిన్ననాటి నుంచి తన రాజకీయ జీవితం వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అత్యున్నత పదవికి చేరుకున్నారు.
రిషి సునాక్.. బ్రిటన్లో సంపన్నుడు, ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు
యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి డిగ్రీలు పొందిన సునాక్.. గోల్డ్మన్ సాచ్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో పని చేశారు. సునాక్ యూకే ఆర్థిక మంత్రిగానూ పనిచేశారు. ఆయన కోవిడ్-19 ఎకనామిక్ రెస్క్యూ ప్యాకేజీకి ప్రశంసలు అందుకున్నారు. అత్యంత సంపన్న బ్రిటిష్ రాజకీయ నాయకులలో ఒకరైన సునాక్, ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తిని వివాహం చేసుకున్నారు. 2009లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు అనుష్క, కృష్ణ.
రిషి సునాక్ బాల్యం ఇలా..
రిషి సునాక్ సౌతాంప్టన్లో మే 12, 1980న వలస మూలాలు కలిగిన కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు యశ్వీర్, ఉష. వీరిద్దరు ఫార్మసిస్ట్లు. తూర్పు ఆఫ్రికా నుంచి యూకేకి వలస వచ్చారు. భారత్లోని పంజాబ్లో మూలాలు కలిగి ఉన్నారు. సునాక్ తాతయ్యలు ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న గుజ్రాన్వాలా అనే ప్రదేశం నుంచి వచ్చారు. అయినప్పటికీ, 1930లలో మతపరమైన అల్లర్లు, రక్తపాతం కారణంగా వారు విడిచిపెట్టి సరిహద్దు దాటవలసి వచ్చింది.
వెయిటర్గానూ పనిచేసిన రిషి సునాక్
సునాక్ తన పాఠశాల విద్యను వించెస్టర్ కళాశాల నుంచి పూర్తి చేశారు. ఇది కనీసం ఆరుగురు ఛాన్సలర్లను తయారు చేసిన ప్రైవేట్ పాఠశాల కావడం గమనార్హం. రిషి వేసవి సెలవుల్లో సౌతాంప్టన్లోని ఇండియన్ రెస్టారెంట్లో వెయిటర్గా కూడా పనిచేశారు. తత్వశాస్త్రం, రాజకీయాలు, ఆర్థిక శాస్త్రాలను అధ్యయనం చేయడానికి ఆయన ఆక్స్ఫర్డ్కు వెళ్లారు.
రిషి సునాక్.. ఆక్స్ఫర్డ్ నుంచి పట్టభద్రుడు
2001లో ఆక్స్ఫర్డ్ నుంచి పట్టభద్రుడయ్యాక, సునాక్.. గోల్డ్మన్ సాచ్స్కు విశ్లేషకులు అయ్యారు. 2004 వరకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీలో పనిచేశారు. ఆ తర్వాత అతను స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ అభ్యసించారు. అక్కడే రిషి.. నారాయణ మూర్తి కుమార్తె అయిన అతని భార్య అక్షతా మూర్తిని తొలిసారి కలుసుకున్నారు.
రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన రిషి సునాక్
రిషి సునాక్ తొలిసారిగా 2015లో రిచ్మండ్ (యార్క్స్) నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017, 2019లో తిరిగి ఎన్నికయ్యారు. రిష.. థెరిసా మే ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేశారు. 2019లో బోరీస్ జాన్సన్ ఆయనను ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఫిబ్రవరి 2020లో ఛాన్సలర్ పదవికి పదోన్నతి పొందారు. ఇక ఇప్పుడు ఏకంగా అత్యున్నత పదవి అయిన బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఎన్నిక కావడంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
విన్స్టన్ చర్చిల్ను ప్రస్తావిస్తూ బ్రిటన్కు ఆనంద్ మహీంద్ర చురక
1947లో భారత స్వాతంత్ర్య శిఖరాగ్ర సందర్భంగా విన్స్టన్ చర్చిల్ "...భారత నాయకులందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారు. గడ్డితో కూడుకున్న వ్యక్తులుగా ఉంటారు' అని వ్యాఖ్యానించారన్నారు పారిశ్రామిక దిగ్గజ ఆనంద్ మహీంద్ర. ఇక ఈరోజు, మన స్వాతంత్ర్యం 75వ సంవత్సరంలో.. యూకే ప్రధానమంత్రిగా భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని చూడటానికి మేము సిద్ధంగా ఉన్నాము. జీవితం అందమైనది... అంటూ ట్విట్టర్ వేదికగా ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మనదేశాన్ని పాలించిన బ్రిటీషర్లను పాలించే అవకాశం భారతీయులకే రావడం గమనార్హం. దీంతో చరిత్ర తిరగరాసినట్లయింది.