ట్రంప్ నిర్ణయాలు: భారత టెక్కీల భయాలకు కారణాలివే..
డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు భారత టెక్కీలను ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నాయి... వారిని ఇబ్బంది పెట్టే అంశాలు ఏమిటనేది చూద్దాం...
హైదరాబాద్: అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఆ దేశంలోని విద్యార్థులను, ఉద్యోగులను మాత్రమే కాకుండా భారతదేశంలోని వారి తల్లిదండ్రులను కూడా కలవరానికి గురి చేస్తున్నాయి. ఐటి కంపెనీలు తీవ్రమైన చిక్కుల్లో పడి ఆయనకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడుతున్నాయి.
నిజానికి, ఎన్నికల హామీలను అమలు చేస్తే హర్షం వ్యక్తమవుతుంది. కానీ ట్రంప్ విషయంలో అందుకు భిన్నమైన ప్రతిస్పందనలు వస్తున్నాయి. ఆయన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. అలా ఎందుకు జరుగుతుందనే దానికి కారణాలు లేకపోలేదు.
హైదరాబాద్ నగరం నుంచి, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి విద్య, ఉద్యోగాల నిమిత్తం పెద్దయెత్తున్న యువత అమెరికా వెళ్లింది. అందులోనూ మధ్యతరగతివారే ఎక్కువ మంది ఉన్నారు. ఇంజినీరింగ్ చదువు పూర్తి కాగానే హెచ్1బి వీసాతో అమెరికా వెళ్లడానికి ప్రయత్నాలు సాగిస్తూ చాలా మంది అలా వెళ్లిపోయారు.
హెచ్1 బీ వీసాపై అక్కడ ఆరేళ్లు ఉద్యోగం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ లోపు గ్రీన్కార్డు పొందడానికి ప్రయత్నిస్తుంటారు. ఒకసారి గ్రీన్ కార్డు రాకపోతే మరోసారి ప్రయత్నిస్తుంటారు. అక్కడ కంపెనీలు కూడా అందుకు సహకరిస్తుంటాయి. దాంతో వారు అక్కడే స్థిరపడిపోతుంటారు.
ట్రంప్ నిర్ణయాలతో ఇప్పుడు ఆ పరిస్థితి ఉండకపోవచ్చుననే భయం పీడిస్తోంది. హెచ్1బి వీసా గడువు ముగిసిపోతే వెనక్కి రావాల్సిందేనని భయం వారిని పట్టి పీడిస్తోంది. అమెరికాకు వెళ్లాలని భావిస్తున్న ఇక్కడి విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో భయాలు నెలకొన్నాయి. అందుకు ప్రధానంగా ఈ కింది కారణాలు కనిపిస్తున్నాయి.
ట్రంప్ నిర్ణయాలు: భారత టెక్కీల భయాలకు కారణాలివే..
ఉద్యోగులు అమెరికా వెళ్లి పని చేసేందుకు వీలు కల్పించేది ఇమిగ్రేషన్ హెచ్1బీ వీసా. ఈ వీసాల సంఖ్యను తగ్గించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 85 వేలకు అలా వెళ్లే అవకాశం ఉంది. అయితే ఒక్క భారతదేశం నుంచే 70 శాతం మందికిపైగా వెళుతుంటారు. హెచ్1బీ వీసాల సంఖ్య తగ్గిస్తే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది.
వేతనాలు పెంచే బిల్లు...
అమెరికాలో భారీగా వార్షిక వేతనాలు పెంచే బిల్లును తేవడానికి ట్రంప్ సిద్ధపడ్డారు. తక్కువ వేతనాలకు భారతీయ టెక్కీలు లభిస్తుండడంతో కంపెనీలు వారికి అవకాశాలు కల్పిస్తూ వస్తున్నాయి. వేతనాలు పెంచితే కంపెనీలు స్థానికులనే నియమించుకుంటాయి. దానివల్ల భారతీయ టెక్కీలకు అవకాశాలు తగ్గిపోతాయి.
బోర్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్(బీఏటీ): భారతీయ సేవలపై 20
శాతం వరకు పన్ను వేసే అవకాశం ఉంది. దాన్ని బోర్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ (బిఎటి) అంటారు. ఇప్పుడు మన ఐటీ సేవలు తక్కువ ఖర్చుకు అందుబాటులోకి వస్తున్నందున మన కంపెనీలకు కొత్త ప్రాజెక్ట్లు వస్తున్నాయి. దిగుమతి పన్ను పడితే మన సేవలకు అమెరికా నుంచి అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉంది.
అమెరికాలో పరిస్థితి ఇప్పుడు అనిశ్చితంగా ఉంది.
ట్రంప్ ఓ మాట అంటుంటే, రిపబ్లికన్లు మరో మాట చెబుతున్నారు. ఈ విషయంలో స్పష్టత రాకపోవడంతో కొత్త ప్రాజెక్ట్లు ఇవ్వడం లేదు. దీంతో మన ఐటీ విక్రయాలు తగ్గిపోతాయని అవకాశం ఉంది. ఆ కంపెనీలు ప్రకటించిన మూడో త్రైమాసిక ఫలితాలు దాన్ని ప్రతిఫలిస్తున్నాయి. రెండంకెల వృద్ధి నుంచి చాలా కంపెనీలు సింగిల్ డిజిట్కు దిగజారాయి.