మొహర్రం పండుగ కాదా ? రంజాన్-బక్రీద్ లతో పోలిస్తే ఏ విధంగా భిన్నమైనది ? చరిత్ర ఇదే..
ముస్లింల ప్రధాన పర్వ దినాలలో మొహరం కూడా ఒకటి. ముస్లిం వీరులైన హసన్, హుస్సేన్ అనే స్మారకంగా బాధాతప్త హృదయాలతో జరుపు కునే ఓ కార్యక్రమంగానే మొహర్రం చరిత్రలో నిలిచింది. ముస్లిం పంచాంగం ప్రకారం చూస్తే అరబిక్ సంవత్సరం మొదటి నెల మొహరం. ఈ నెల ప్రారంభమైన పదో రోజు మొహరం నిర్వహిస్తారు. మొహరం నెల మొదటి తేదీ నుండి పదవ తేదీ వరకు జరుపుకుంటారు. మొహరం పండుగనే ''పీర్ల పండుగ '' అని భారత్ వంటి దేశాల్లో పిలుస్తారు. పీర్ అంటే మహాత్ములు, ధర్మనిర్దేశకులు అని అర్థం. ధర్మ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు ప్రతీకగా హస్తాకృతి కలిగిన రూపాలను తయారు చేసి వాటిని అలంకరించి, ఊరేగించి, పూజించే వాటిని పీర్లు అని వ్యవహరిస్తుంటారు.
మొహర్రం పండుగ కాదా ?
'మొహరం' అంటే పండగ కాదు. వేడుక అంతకన్నా కాదు. ఇది కేవలం అమరవీరుల త్యాగాలను స్మరించుకునే ఓ ప్రత్యేకమైన రోజు మాత్రమే. ఇస్లాం రాజ్యాధిపతి యాజిద్ సిద్దాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్దాంతాన్ని జోడించడంతో మహమ్మద్ ప్రవక్త మనవడు హాజరత్ ఇమామ్ హుసైన్ దాన్ని ఎదిరించారు. ప్రాచీనకాలంలో ఆషూరా దినం. అనగా మొహర్రం యొక్క పదవ తేదీని అనేక సాంప్రదాయక గుర్తుల కనుగుణంగా పర్వముగాను పండుగగానూ జరుపుకునేవారు. పద్నాలుగు శతాబ్దాల క్రితమే ప్రజాస్వామ్యం కోసం మానవ హక్కుల కోసం జరిగిన చరిత్రాత్మక పోరాటం 'మొహరం'. ఈ పేరు వినగానే పీర్లు, నిప్పుల గుండాలు, గుండెలు బాదుకుంటూ 'మాతం' పఠనం గుర్తుకొస్తాయి. మొహర్రం జరిగే పది రోజులు విషాద దినాలే కాని, ఎంత మాత్రం పర్వదినాలు కావు. ముస్లింలు పాల్గొని అమరవీరులకు అల్విదా, అల్విదా అంటూ గుండెలు బాదుకొని రక్తం చిందించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే షియా ముస్లింలు ఎక్కువగా ఇందులో పాలుపంచుకుంటుంటారు.
మొహర్రం ప్రత్యేకతలివే
1400 ఏళ్ల క్రితం హిజ్రీశకం 60లో జరిగిన ఓ యదార్ధ ఘటనకు ప్రతి రూపం ఈ మొహర్రం. మహమ్మద్ ప్రవక్త అల్లాహ్ నుండి దైవవాణి గ్రహించి దానిని దివ్యఖురానుగా గ్రంథస్తం చేశారు. ఇస్లాం ప్రపంచ వ్యాప్తంగా ఆయన అడుగు జాడల్లో విస్తరించింది. ఈ నేపధ్యంలో అప్పటి ఇస్లాం రాజ్యాధిపతి యాజిద్ సిద్దాంతాన్ని ధిక్కరించి ఇస్లాంలో తన సిద్దాంతాన్ని జోడించడంతో మహమ్మద్ ప్రవక్త మనవడు హాజరత్ ఇమామ్ హుసైన్ దాన్ని ఎదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు 72 మంది అంతా యుద్ధ మైదానంలో నిలబడవలసి వచ్చింది. ఇహ లోకం కంటే పరలోకమే మేలని ప్రాణత్యాగానికైనా సిద్ధమని నిలబడ్డారు. ఎట్టి పరిస్థితిల్లోనూ ఇస్లాం సిద్దాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడాలని అని యాజిద్ బలవంతం చేసాడు. జాలీ, కరుణ, కనికరం లేకుండా అత్యంత హేయంగా ఇమామ్ హుస్సేన్ కుటుంబసభ్యులను శత్రు సైన్యం ఇరాక్ లోని అప్పటి కర్బలా మైదానంలో హతమార్చారు. రెండేళ్ళ చిన్నారిని సైతం వదలకుండా క్రూరంగా అంతమొందించారు. మొహర్రం నెల పదో రోజు హజరత్ ఇమాం హుసైన్ సైతం వీర మరణం పొందారు. ఈ త్యాగనిరతికి ప్రపంచం ఆశ్చర్య పోయింది. ఇస్లాం అంటే ప్రాణాలు, కుటుంబం బలిదానం అని, మహత్తరమైనదని నిరూపణ అయింది.
మొహర్రం ప్రపంచానికి ఇచ్చిన సందేశం
నాడు కర్బలా మైదానంలో సాగిన బలిదానాలతో ఇస్లాం అంటే శాంతి అని ఆ మత ఆచారాలను, వాస్తవాలను తెలుసుకోవాలని ప్రపంచమంతా జిజ్ఞాస కలిగింది. దీంతో ఇస్లాం కూడా వేగంగా విస్తరించింది. ఇస్లాం పునర్రుజ్జీవానికి ప్రాణం పోసిన ఆ అమరుల త్యాగాన్ని స్మరించడమే మొహారం. అందుకే 'మోహరం' పండుగ కాదు. మహ్మద్ ప్రవక్త కుటుంబం చేసిన త్యాగాల్ని స్మరించడం. తెలుగు ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా నిజాం పాలిత ప్రాంతాల్లో మొహర్రం పండుగను ముస్లిములే కాక అన్ని వర్గాల ప్రజలూ జరుపుకోవడం వందలాది ఏళ్ళుగా సాగుతోంది. మొహర్రం నెల పదో రోజు యౌమీ ఆషూరా. ముహమ్మద్ ప్రవక్త మనుమడైన హుసేన్ ఇబ్న్ అలీ, కర్బలా యుద్ధంలో అమరుడైన రోజు ఇది. మొహర్రం నెలను "షహీద్ " ( అమరవీరుల ) నెలగా వర్ణిస్తూ, పండుగలా కాకుండా వర్థంతిలా జరుపుకుంటారు. షియా ఇస్లాంలో ఈ మొహర్రం నెల, "ఆషూరా", కర్బలా యుద్ధంలో మరణించిన వారి జ్ఞాపకార్థం, శోక దినాలుగా గడుపుతారు. షియాలు మాతమ్ ( శోక ప్రకటన ) జరుపుతారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పీర్ల పండుగగా జరుపుతారు. షియా ముస్లింలు తమను తాము హింసించుకుంటూ విషాదం వ్యక్తం చేస్తూ ఊరేగింపులో పాల్గొంటారు.