సౌదీ అరేబియా చమురు నిల్వలపై తిరుగుబాటుదారుల దాడుల ప్రభావం భారత్పై ఎందుకు పడుతోంది
యెమెన్లో ఇరాన్ మద్దతున్న హూథీ తిరుగుబాటుదారుల గ్రూప్ సౌదీ అరేబియా చమురు నిల్వలపై చేసిన దాడుల ప్రతిధ్వని భారత్లో కూడా వినిపిస్తోంది.
హూథీ తిరుగుబాటుదారులు ఆదివారం సౌదీ అరేబియాపై జరిపిన దాడి తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర(బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర) బ్యారెల్కు దాదాపు మూడు శాతం పెరిగి 71.37 డాలర్లకు చేరింది.
ఈ ప్రభావం భారత్పై కూడా పడుతుందనేది సుస్పష్టం. ఎందుకంటే, దేశ ఆర్థిక వ్యవస్థ చాలావరకూ చమురు దిగుమతులపైనే ఆధారపడి ఉంటుంది.
గత ఏడాది ఫిబ్రవరి తర్వాత కరోనా మహమ్మారి మొదలైన మొదటి వారాల్లో బ్రెంట్ క్రూడ్(ముడి చమురు) బ్యారల్ ధర 20 డాలర్లకు పడిపోయింది. అప్పటి నుంచి, ఇప్పటివరకూ అది 83 శాతం పెరిగింది. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరగడం వెనకున్న ఎన్నో కారణాల్లో ఇది ఒకటి.
సౌదీ అరేబియా ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశం. భారత్ దిగుమతి చేసుకునే చమురులో అత్యధికంగా ఈ దేశం నుంచే వస్తుంది.
చమురు దిగుమతి చేసుకోవడంలో అమెరికా, చైనా తర్వా భారత్ మూడో అతిపెద్ద దేశంగా ఉంది. భారత్ గత ఏడాది తన పెట్రోలియం అవసరాల్లో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడింది. ఇందుకు 120 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
అందుకే, సౌదీ అరేబియాపై దాడుల ప్రభావం నేరుగా భారత ఆర్థికవ్యవస్థపైనా ఉంటుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారల్కు 10 డాలర్లు పెరిగిన ప్రతిసారీ, భారత్ చమురు దిగుమతి బిల్లు ఎన్నో రెట్లు పెరిగిపోతుంది.
మరోవైపు పెట్రోల్ పంపుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా పెరుగుతాయి. ఈమధ్య భారత్లోని కొన్ని నగరాల్లో పెట్రోల్ ధర మొదటిసారి లీటర్ 100 రూపాయలకు చేరుకుంది.
ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులను నిశితంగా గమనించే నిపుణులు, ముంబయిలో గుప్తా కమోడిటీస్ అధ్యక్షుడు ప్రతీక్ కుమార్ దీని గురించి వివరంగా చెప్పారు.
గల్ఫ్ దేశాల్లో గత ఆరేళ్లుగా చెలరేగిన యుద్ధాల వల్లే చమురు మార్కెట్లో అనిశ్చితి ఏర్పడిందని తెలిపారు.
"సౌదీ అరేబియా, యెమెన్లోని హూథీల మధ్య శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోంది. ఎందుకంటే, రెండింటి మధ్య కొనసాగుతున్న యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు అది మంచిది కాదు" అన్నారు.
కానీ, "సౌదీ అరేబియా దాడుల వల్ల చమురు ధరలు పెరుగుతాయి. అవి కొంతకాలం ఉంటాయి. ఒకటి రెండు రోజుల తర్వాత మళ్లీ తగ్గిపోతుంటాయి" అని ఓఎన్జీసీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ శర్మ చెబుతున్నారు.
"ప్రపంచ నిపుణులందరూ ఈ ఏడాది చమురు ధరలు మరింత పెరుగుతాయని ఊహిస్తున్నారు. నాకు తెలిసి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగవు. ఎందుకంటే, రష్యా, అమెరికా చమురు ఉత్పత్తిని పెంచుతాయి. దాంతో మార్కెట్లో చమురు సప్లయికి ఏ ఢోకా ఉండదు. ధర కూడా నియంత్రణలో ఉంటుంది" అన్నారు.
"సౌదీ అరేబియాలో మా గ్రూప్ 8 బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించింది, బాంబులు అమర్చిన 14 డ్రోన్లతో మేం దాడులు చేశాం" అని ఇరాన్ మద్దతున్న హూథీ తిరుగుబాటుదారుల బృందం ప్రతినిధి యాహియా సారీ ఆదివారం చెప్పారు.
ఆదివారం రాస్ తనూరా ఎగుమతి టెర్మినల్ మీద డ్రోన్ దాడి జరిగిందని సౌదీ అరేబియా ఇందన మంత్రిత్వ శాఖ కూడా చెప్పింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం జగలేదని స్పష్టం చేసింది.
రాస్ తనూరా ప్రపంచంలో అతిపెద్ద చమురు టెర్మినల్, ఒక్క రోజులో దాదాపు 65 లక్షల బ్యారెళ్లు ఎగుమతి చేసే సామర్థ్యం దానికి ఉంది. అంటే, అది ప్రపంచ చమురు డిమాండ్లో 7 శాతం. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న చమురు టెర్మినళ్లలో ఇదొకటి.
హూథీ తిరుగుబాటుదారుల దాడులు
ఆరేళ్ల క్రితం యెమెన్ అంతర్యుద్ధం తర్వాత షియా హూథీ మిలీషియా దేశంలోని ఉత్తర భాగాన్ని, రాజధాని సనాను స్వాధీనం చేసుకుంది.
ఈ మిలీషియాకు ఇరాన్ మద్దతు ఉందని సౌదీ అరేబియా చెప్పింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి కొన్ని గల్ఫ్ దేశాలతో కలిసి 2015లో యెమెన్లో హూథీ తిరుగుబాటు దారులపై దాడులు చేసింది.
ఈ యద్ధంలో ఇప్పటివరకూ 12 వేల మందికి పైగా చనిపోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. యెమెన్లో ఈ యుద్ధం వల్ల ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవతా సంక్షోభం ఏర్పడిందని ఐక్యరాజ్యసమితి అంటోంది.
డోనల్డ్ ట్రంప్ తన పదవీకాలంలో హూథీ తిరుగుబాటుదారులను తీవ్రవాదులుగా ప్రకటించారు. కానీ జో బైడెన్ అధ్యక్షుడు అయ్యాక, ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. తర్వాత హూథీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై డ్రోన్, మిసైల్ దాడులు పెంచారు. ఆదివారం జరిగిన దాడి వాకం రోజుల్లో రెండవది.
ఈ దాడులతో బైడెన్ ప్రభుత్వం కష్టాలు పెరిగాయి. దానితోపాటూ అంతర్జాతీయ చమరు మార్కెట్ అనిశ్చితిలో పడింది. చమురు ధరలు పెరగడమే దీనికి కారణం.
మరోవైపు చమురు డిమాండ్, ధర కూడా పెరిగేలా చమురు ఉత్పత్తి చేసే దేశాల సంస్థ(ఒపెక్) చమురు ఉత్పత్తిని తగ్గించింది.
భారత ప్రభుత్వం చమురు ఉత్పత్తి పెంచాలని సౌదీ అరేబియా, చమురు ఉత్పత్తి చేసే మిగతా పెద్ద దేశాలను కోరింది. కానీ ఈ దేశాలు భారత డిమాండును పట్టించుకోలేదు.
"దేశంలో పెట్రోల్ పంపుల్లో లభించే పెట్రోల్, డీజిల్ ధరలకు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు సంబంధం ఉంటుంది. అంటే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినా, పెరిగినా, భారత్లో కూడా అవి తగ్గడం, పెరగడం కనించాలి. కానీ గత ఆరేళ్లుగా అలా జరగడం లేదు" అని ఇంధన రంగంలో నిపుణులు, ఓఎన్జీసీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ శర్మ అన్నారు.
భారత విశాల ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి చమురు ఇంధనంలా పనిచేస్తుంది. చమురు ధరలు అలా పెరుగుతూనే ఉండడం వల్ల ద్రవ్యోల్బణం, జీడీపీ, కరెంట్ అకౌంట్ మీద దాని ప్రభావం పడుతుంది.
దీంతో ఆర్థికవ్యవస్థ ఆరోగ్యం పాడవ్వచ్చు. అది డిమాండ్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. దానివల్ల ఆర్థిక వృద్ధి కూడా ప్రభావితం అవుతుంది.
ఇవి కూడా చదవండి:
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
- విజయవాడ టీడీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ.. మేయర్ పీఠం కోసమేనా
- కడప స్టీల్: ముగ్గురు ముఖ్యమంత్రులు, మూడుసార్లు శంకుస్థాపనలు.. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేనా?
- తెలుగు భాషకు తమిళంలా స్వయం ప్రతిపత్తి సాధ్యం కాదా?
- హిట్లర్ కోసం విషం రుచిచూసే మహిళల కథ
- ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య: తప్పెవరిది, అమ్మాయిలదా.. తల్లిదండ్రులదా.. సమాజానిదా? :అభిప్రాయం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)