పఠాన్కోట్ దాడి దర్యాప్తు త్వరలో పూర్తి: షరీఫ్
లాహోర్: పఠాన్కోట్ ఉగ్రవాద దాడిపై దర్యాప్తును త్వరలోనే పూర్తిచేసి, దర్యాప్తు నివేదికను బహిరంగ పరుస్తామని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ శనివారం చెప్పారు. ఈ దాడి పాక్పై ప్రతికూల ప్రభావం చూపించడమే గాక, భారత ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ల పాక్ పర్యటన తర్వాత సరయిన దిశలో సాగుతున్న చర్చలను సైతం భగ్నం చేసిందని షరీఫ్ చెప్పారు.
‘పఠాన్కోట్ దాడిపై దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తు నివేదికను త్వరలోనే అందరి ముందూ ఉంచుతాం' అని ఆయన అన్నారు. జనవరి 2న పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడి చేయడానికి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు తమ భూభాగాన్ని ఉపయోగించుకుని ఉంటే దాన్ని వెలుగుతీయడానికి తాము ఎంత దూరమైనా వెళ్తామని షరీఫ్ చెప్పారు.

‘ఒకవేళ ఈ దాడిలో మన భూభాగాన్ని ఉపయోగించుకుని ఉంటే దాన్ని బైటపెట్టడం మా బాధ్యత. దర్యాప్తు తొందరలోనే పూర్తవుతుంది' అని ఆయన చెప్పారు. ఉగ్రవాదులను తుదముట్టిస్తున్నామని, దిక్కుతోచని వారు తమ ఉనికిని చాటుకోవడానికి అడపడదపా దాడులకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. మిగిలివున్న మిలిటెంట్లను కూడా మట్టుబెడతామన్నారు.
ఇదిలా ఉండగా, పఠాన్కోట్ దాడికి సంబందించి అరెస్టు చేసిన అనుమానితులెవరిపైనా అభియోగాలు నమోదు చేయలేదని పంజాబ్ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి రాం సనావుల్లా చెప్పారు. ఈ దాడితో జైషే మహమ్మద్కు సంబంధం ఉందనే విషయం నిర్ధారణ అయిందా అని అడగ్గా, ఆ విషయాన్ని కూడా దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోందని రాణా చెప్పారు.












Click it and Unblock the Notifications