Iran Israel War: ఖమేనీ పాలన పతనమైతే ఇరాన్ ముక్కలవుతుందా?
Iran Israel War: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ ఇరాన్లోని ప్రముఖ సైనిక అధికారులు, ప్రముఖులను లక్ష్యంగా చేసుకుంది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కథ ముగిస్తామని ప్రకటించింది. తాజాగా టెల్ అవీవ్లోని ఓ ఆస్పత్రిపై మిస్సైల్స్తో ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనినే బాధ్యత వహించాలంటూ పేర్కొన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్.. త్వరలోనే ఖమేనీ కథను ముగిస్తామని.. ఇరాన్ దేశాన్ని ఖమేనీ విముక్త దేశంగా మారుస్తామని ప్రకటించారు. జూన్ 13 నుంచి రెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. పోటాపోటీగా దాడులు జరుపుతున్నాయి.
ఇజ్రాయెల్ ఖమేనీ పాలనను అంతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యతిరేక వర్గాలు కూడా ఇలాగే కొనసాగితే త్వరలోనే ఖమేని పాలన అంతమవుతుందని భావిస్తున్నాయి. ఈ చర్చలు, వాదనల నేపథ్యంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖమేనీ పాలన పతనమైతే ఇరాన్ పరిస్థితి ఏంటి? మళ్లీ రెజా పహ్లావీ మద్ధతుదారుల చేతికి అధికారం వస్తుందా లేదా మరేదైనా సముహం పగ్గాలు చేపడుతుందా?.. ఖమేనీ తర్వాత ఇరాన్ విడిపోవచ్చని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఇరాన్కు చెందిన బహిష్కృతి నాయకుడు ఇమాన్ ఫోరోటాన్.. అధికార మార్పిడి తర్వాత ఇరాన్ విడిపోవచ్చని, వాయవ్య ఇరాన్లో నివసించే కుర్దులు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల మధ్య, ఇరాన్లో ఖమేనీ పాలన పతనమైతే దేశం విడిపోయే అవకాశం ఉందని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సంభావ్యత వెనుక ఇరాన్ జాతి, మతపరమైన వైవిధ్యం ప్రధాన కారణంగా ఉంది.
ఇరాన్లో ఎక్కువ మంది షియా ముస్లింలే..
ఈ ఊహాగానాలకు కారణాలను తెలుసుకోవాలంటే, ఇరాన్ జాతి నిర్మాణాన్ని పరిశీలించడం అవసరం. ముఖ్యంగా ఇక్కడి జనాభా, వివిధ ప్రాంతాలలో నివసించే విభిన్న సాంస్కృతిక, మతపరమైన కమ్యూనిటీల స్థితిగతులు ఏమిటో తెలుసుకోవాలి. ఇటీవలి నివేదిక ప్రకారం, ఇరాన్ అంచనా జనాభా 87.6 మిలియన్లు ఉంటుంది. ఇరాన్ ప్రభుత్వ అంచనా ప్రకారం, ఇక్కడి జనాభాలో 99.4 శాతం మంది ముస్లింల. , వీరిలో 90 నుండి 95 శాతం మంది షియాలు. 5 నుండి 10 శాతం మంది సున్నీలు ఉన్నారు.
కేవలం 5 నుండి 10 శాతం సున్నీ జనాభా
ఇరాన్లో ఎక్కువ మంది సున్నీలు తుర్క్మెన్, అరబ్, బలూచ్, కుర్దులు. వీరిలో తుర్క్మెన్ ఇరాన్ ఉత్తర తూర్పున, అరబ్లు నైరుతిలో, బలూచ్లు ఆగ్నేయంలో, కుర్దులు వాయవ్య ప్రావిన్సులలో నివసిస్తున్నారు. ఆఫ్ఘన్ శరణార్థులు, ఇతర వలసదారులు కూడా సున్నీ జనాభాలో పెద్ద భాగం. ఆఫ్ఘన్ శరణార్థుల జనాభా సున్నీలు, షియాలుగా విభజించబడింది. సున్నీలు తరచుగా షియా-ఆధిపత్య ప్రభుత్వం నుంచి బయటపడాలని భావిస్తారు.
ఇరాన్ ఈ వైవిధ్యమైన జాతీ, మతపరమైన నిర్మాణం జాతి జాతీయవాదం అనే భావనను ప్రేరేపిస్తుంది. కుర్దులు, బలూచీలు, అరబ్బులు వంటి కమ్యూనిటీలలోని కొంతమంది సభ్యులు చాలా కాలంగా మరింత స్వయంప్రతిపత్తి లేదా స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేస్తున్నారు. ఖమేనీ పాలన పతనమైతే కేంద్ర అధికారం బలహీనపడే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఈ సమూహాలకు తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి, విచ్ఛినకర ఉద్యమాలను తీవ్రతరం చేసుకోవడానికి అవకాశం కల్పించవచ్చు. ఖమేనీ పాలన పతనమైన పక్షంలో, అధికారం కోసం పలువురు పోటీదారులు ముందుకు రావచ్చు. వీరిలో రజా పహ్లావీ మద్దతుదారులు లేదా ఇతర ఇస్లామిక్ లేదా జాతీయవాద సమూహాలు ఉండవచ్చు. అయితే, దేశంలోని జాతి, మతపరమైన విభజన రేఖలను బట్టి చూస్తే, కొన్ని జాతి సమూహాలు ఈ అస్థిరతను ఉపయోగించుకుని తమకు ఒక ప్రత్యేక గుర్తింపు లేదా ఒక స్వతంత్ర రాజ్యం కోసం డిమాండ్ చేసే అవకాశం ఉంది, ఇది అంతిమంగా ఇరాన్ విభజనకు దారితీయవచ్చు.












Click it and Unblock the Notifications