Pakistan: ఉద్యోగుల జీతాల్లో కోతలు.. దిగజారుతున్న పాక్ ఆర్థిక స్థితి..
పాకిస్థాన్ లో ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించాలని నిర్ణయం తీసుకున్నట్ల వార్తలు వస్తున్నాయి.
పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతోంది. ఆర్థిక సంక్షోభంతో పాక్ కొట్టుమిట్టాడుతుంది. ఆర్థిక సంక్షోభంతో పాటు పాక్ రాజకీయ అస్థిరత కూడా నెలకొంది. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాక్ ఖజానాలో మూడు వారాలకు సరిపడా విదేశీ మారక నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం పొదపు చర్యలు చేపట్టింది.
అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను తగ్గించడంతో పాటు మంత్రుల ఖర్చులను తగ్గించే చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉద్యోగాల వేతనాల్లో 10 శాతం కోత, మంత్రుల ఖర్చులను 15 శాతం కోత విధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మంత్రల సంఖ్యను కూడా తగ్గాంచాలని భావిస్తోంది. 78 మంది ఉన్న మంత్రుల సంఖ్యను 35 తగ్గించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి మరో విడత డబ్బు సాయం కోరుతోంది. అయితే, 2019లో ఇస్లామాబాద్లో భద్రపరచబడిన $6 బిలియన్ల బెయిలౌట్ ప్యాకేజీలో భాగంగా $1.18 బిలియన్ల నిధుల కోసం సమీక్షను పూర్తి చేయడానికి ఒక బృందాన్ని దేశానికి పంపడానికి IMF నిరాకరించింది.IMF ప్రస్తుతం పాకిస్తాన్ సంస్కరణలను అమలు చేయాలని కోరుతుంది. ప్రస్తుతం పాక్ అధికారులు, ఐఎంఎఫ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పాక్ విలాసవంతమైన వాహనాల కొనుగోలుపై నిషేధించింది.