ప్రియుడ్ని చంపి ఫేస్బుక్లో యువతి సంతాపం: అరెస్ట్
న్యూయార్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణ ఘట చోటు చేసుకుంది. ఓ మహిళ తన ప్రియుడ్ని దారుణంగా చంపేసింది. అంతటితో ఆగకుండా ఆ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో పేర్కొంది. దీంతో దర్యాప్తు జరిపిన పోలీసులు గత ఆదివారం హంతకురాలిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కినెట్టారు.
వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియాలోని హేమెట్ నగరానికి చెందిన నకాసియా జేమ్స్(18) వారం కిందట తన ప్రియుడు డొరియన్ పావెల్ (21) కత్తితో పొడిచి చంపింది. ఇంట్లో వ్యవహారాల విషయమై జరిగిన గొడవ చివరకు హింసాత్మకంగా మారి.. పావెల్ మృతికి దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు.
కాగా, 'నా ప్రియుడితో గొడవ జరిగింది. దీంతో అతడు నా చెంపమీద కొట్టాడు. కోపంలో నేనేం చేస్తున్నానో ఆలోచించలేదు. చేతిలోకి కత్తి తీసుకొని పొడిచేశాను. అతన్ని గాయపర్చాలని అనుకోలేదు. కానీ, అతడు చనిపోయాడు. ఆ తర్వాత నేను పరారయ్యాను' అని నిందితురాలు నకాసియా తన ఫేస్బుక్ ఖాతాలో తెలిపింది.
ఆ తర్వాత, ప్రియుడిని చంపడంపై ఆమె తన పోస్టులో విచారం వ్యక్తం చేసింది. తాను నిజంగా అతన్ని కత్తితో పొడవాలని అనుకోలేదని, అనుకోకుండా జరిగిందని, ఇందుకు దేవుడు తనను క్షమిస్తాడని భావిస్తున్నానని పేర్కొంది. అంతేగాక, ప్రియుడి మృతికి తీవ్ర సంతాపం తెలిపింది.
అయితే, ప్రియుడ్ని చంపిన విషయమై ఆమె పెట్టిన ఫేస్బుక్ పోస్టును ప్రస్తుతం తొలగించారు. జనవరి 11న పావెల్ మృతదేహాన్ని కనుగొన్న పోలీసులు ప్రస్తుతం నకాసియాను అరెస్టుచేసి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.