పెళ్లికి నో చెప్పింది: లేడీ టీచర్ సజీవదహనం
ఇస్లామాబాద్: పెళ్లి ప్రపోజల్ కు అంగీకరించలేదని ఓ లేడీ టీచర్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవదహనం చేసిన దారుణ సంఘటన పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో జరిగింది. రెండు రోజులు మృత్యువుతో పోరాడిన ఆ యువతి చివరికి ప్రాణాలు విడిచింది.
పోలీసు అధికారి మజార్ ఇక్బాల్ కథనం మేరకు ఇస్లామాబాద్ సమీపంలోని ముర్రీ ప్రాంతంలో మరియా సదాఖత్ (19) అనే యువతి నివాసం ఉంటున్నది. ఈమె ఓ ప్రయివేటు స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నది.
స్కూల్ ప్రిన్సిపాల్ కు ఓ కుమారుడు ఉన్నాడు. తన కుమారుడిని వివాహం చేసుకోవాలని ప్రిన్సిపాల్ సదాఖత్ కు చెప్పాడు. అయితే తనకంటే రెట్టింపు వయస్సు ఉందని, మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన వ్యక్తితో తాను వివాహం చేసుకోనని సదాఖత్ తేల్చి చెప్పింది.
చివరికి ఆ స్కూల్ లో ఉద్యోగం నిలిపి వేసింది. ఈ విషయంపై కక్ష పెంచుకున్న ప్రిన్సిపాల్ తదితరులు బుధవారం సదాఖత్ ను పట్టుకుని పెళ్లి చేసుకోవాలని గట్టిగా హెచ్చరించారు. అందుకు సదాఖత్ నిరాకరించింది.
ఆవేశంతో రగిలిపోయిన ప్రిన్సిపాల్ తో పాటు మరో నలుగురు ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలైన సదాఖత్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై ఆమె మరణించిందని పోలీసు అధికారి మజార్ ఇక్బాల్ చెప్పారు.
సదాఖత్ మరణించే ముందు వాంగ్మూలం ఇచ్చింది. ప్రిన్సిపాల్ తో పాటు మరో నలుగురు తనకు నిప్పంటించారని పోలీసులకు చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటికే ఒకరిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.