ప్యారిస్ దాడులు: సిరియాకు చెక్కేసిన వాంటెడ్ వుమెన్
అంకారా: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో ఉగ్రవాద దాడులకు పాల్పడినవారిలోని ఒకరి ప్రేయసి అయిన మహిళ సిరియాకు చెక్కేసినట్లు టర్కీ విదేశాంగ మంత్రి చెప్పారు. ఆమె టర్కీ నుంచి ఈ నెల 8వ తేదీ సిరియాకు వెళ్లినట్లు తెలిపారు. హయత్ బౌమిడియన్నే అనే మహిళ కోసం ప్యారిస్ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే.
ఆమె జనవరి 2వ తేదీన మాడ్రిడ్ నుంచి టర్కీకి చేరుకుని, దాడుల నేపథ్యంలో ఇస్తాంబుల్ హోటల్లో ఉందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనదోలు ఏజెన్సీకి మెవ్లుట్ కావుసోగ్లు సోమవారంనాడుచెప్పారు. గురువారంనాడు ఆమె సరిహద్దులు దాటినట్లు టర్కీ అధికారులకు సమాచారం అందిందని ఆయన చెప్పారు.
చార్లీ హెబ్డో ఊచకోతకు మర్నాడు ఆమె భర్త ఓ మహిళా పోలీసును కాల్చి చంపాడు. ఆ రోజే ఆమె సిరియాలకు చేరినట్లు టర్కీ అధికారులు చెబుతున్నారు. ఆ మహిళ కోసం ఫ్రాన్స్ భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. వరుస దాడుల తర్వాత ఇంకా దాడులు జరిగే ప్రమాదం ఉండడంతో ఆ మహిళకోసం అన్వేషణ అత్యవసరమని ప్రధాని మాన్యుయెల్ వాల్స్ అన్నారు.
ఇదిలావుంటే, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా ఆదివారం నాడు ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యూకే ప్రధాని డేవిడ్ కామెరూన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ తదితరులు పాల్గొన్నారు.
గత వారంలో మూడు రోజుల పాటు ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 17మంది ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళులు అర్పిస్తూ శనివారం నాడు 70 లక్షల మంది ప్రజలు ర్యాలీ తీశారు. ఇందులో భాగంగానే ఆధివారం ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రభుత్వం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది రెండువేల మంది పోలీసు అధికారులు, 1,350 మంది జవానులు రాజధాని అంతటా భద్రత నిర్వహించారు.