PM Salary: ఆ దేశ ప్రధాని జీతం పెంపు, ఏకంగా రూ. 27 కోట్ల ప్యాకేజీ!
రాజకీయాల్లోకి రావడం అంటే ప్రజాసేవ మాత్రమే కాదు, దానికి తగ్గ భారీ పారితోషికం కూడా ఉండాలని భావిస్తోంది సింగపూర్ ప్రభుత్వం. సమర్థవంతమైన నాయకత్వం కావాలంటే దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పిన ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్, తమ దేశ రాజకీయ నాయకుల జీతాలను ఏకంగా 60 శాతానికి పైగా పెంచుతున్నట్లు పార్లమెంట్లో సంచలన ప్రకటన చేశారు.
ఈ పెంపుతో ప్రధాని లారెన్స్ వాంగ్ వార్షిక వేతనం బెంచ్మార్క్ ఏకంగా 3.6 మిలియన్ సింగపూర్ డాలర్లకు (మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 27 కోట్లు) చేరనుంది. గతంలో ఉన్న రూ. 16.5 కోట్ల వేతనాన్ని ఒక్కసారిగా ఈ స్థాయికి తీసుకెళ్లడం అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. అయితే, తన జీతంలో పెరిగిన రూ. 10.5 కోట్ల అదనపు మొత్తాన్ని ప్రధాని వాంగ్ సమాజంలో తగిన స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని ప్రకటించడం గమనార్హం.
డిప్యూటీ పీఎం, మంత్రుల జీతాలు కూడా అంబరాన్ని తాకేలా!
కేవలం ప్రధాని వేతనమే కాదు, క్యాబినెట్ మొత్తానికి జీతాల పెంపు భారీగా వర్తించనుంది. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ జీతం రూ. 14.02 కోట్ల నుంచి రూ. 22.94 కోట్లకు పెరగనుంది. అలాగే ఇతర కేంద్ర మంత్రుల జీతాలు వారి సీనియారిటీ, పర్యవేక్షించే శాఖల బాధ్యతలను బట్టి రూ. 13.5 కోట్ల నుంచి రూ. 21.59 కోట్ల వరకు ఉంటాయి.

అక్టోబర్ 15 నుంచి మంత్రులందరికీ ఒకేసారి 9 శాతం వరకు జీతం సర్దుబాటు కానుండగా, ఆ తర్వాతి పెరిగిన మొత్తాలు వారి వ్యక్తిగత పనితీరు ఆధారంగా మాత్రమే అందుతాయి. ఎంపీల నెలవారీ అలవెన్స్ను కూడా సింగపూర్ డాలర్లు 13,750 నుంచి 18,500కి పెంచారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా అదనంగా కోట్లాది రూపాయల భారం పడనుంది.
జీతం రూ. 27 కోట్లు ఇస్తానన్నా రావడానికి ఎవరూ సిద్ధంగా లేరు!
ప్రజాధనాన్ని ఇలా రాజకీయ నాయకుల జీతాలకు భారీగా కేటాయించడంపై తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో ప్రధాని వాంగ్ అసలు నిజాన్ని బయటపెట్టారు. తమ దేశంలో సమర్థులైన అధికారులు, ప్రైవేట్ రంగంలోని నిపుణులు రాజకీయాల్లోకి రావడానికి తీవ్రంగా వెనుకంజ వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు ముందు తాను స్వయంగా పలువురు సీనియర్ ఐఏఎస్ స్థాయి అధికారులు, కార్పొరేట్ కంపెనీల సీఈఓలను సంప్రదించి రాజకీయాల్లోకి రమ్మని కోరినప్పటికీ ఒక్కరు కూడా ముందుకు రాలేదని తెలిపారు.
ప్రైవేట్ రంగంలో భారీ ప్యాకేజీలు తీసుకుంటున్న నిపుణులు, రాజకీయాల్లోకి వచ్చి సొంత కెరీర్ను వదులుకోవడానికి సిద్ధంగా లేరని, పైగా ఎన్నికల్లో గెలుస్తామన్న గ్యారెంటీ కూడా లేకపోవడమే దీనికి కారణమని స్పష్టం చేశారు. మున్ముందు ప్రభుత్వంలో కీలక మంత్రులు వయోభారంతో పదవీ విరమణ చేయాల్సి వస్తే, కొత్త తరం నాయకులను తయారు చేయడం సవాలుగా మారిందని ఆయన వివరించారు.
అవినీతి రహిత పాలన కోసమే ఈ బిగ్ ప్లాన్!
గత 15 ఏళ్లుగా మంత్రుల జీతాలు పెంచకపోవడం వల్ల ప్రైవేట్ రంగానికి, రాజకీయ రంగానికి మధ్య జీతాల వ్యత్యాసం చాలా ఎక్కువైందని ప్రధాని గుర్తుచేశారు. సింగపూర్ ప్రభుత్వం అవినీతిరహిత పాలనకు ప్రపంచంలోనే పేరుగాంచింది. నాయకులకు అత్యున్నత స్థాయి "క్లీన్ వేజ్" ఇవ్వడం ద్వారా వారు అవినీతి బాట పట్టకుండా అడ్డుకోవచ్చనేది సింగపూర్ రాజ్యాంగ వ్యూహం. రాబోయే తరాల్లో కూడా అత్యంత ప్రతిభావంతులైన నాయకులు దేశాన్ని నడిపించేందుకు ఈ జీతాల పెంపు నిర్ణయం అత్యంత కీలకమని, ఇది ఇప్పటి నాయకుల కోసం కాక భవిష్యత్తు నాయకత్వ నిర్మాణం కోసం తీసుకున్న నిర్ణయమని లారెన్స్ వాంగ్ సమర్థించుకున్నారు.














Click it and Unblock the Notifications
