వాల్స్ట్రీట్ జర్నల్ సంచలనం- వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా- వైద్యసాయం కోరిన శాస్తవేత్తలు
ప్రపంచ దేశాల్ని కుదిపేస్తున్న కోవిడ్ మహమ్మారి జన్మస్ధలం చైనాలోని వుహాన్ ల్యాబేనని నిర్ధారించే మరో ఆధారాన్ని అమెరికాకు చెందిన వాల్స్ట్రీట్ జర్నల్ బయటపెట్టంది. యూఎస్ నిఘా వర్గాలను ఉటంకిస్తూ తాజాగా వెలువరించిన నివేదిక ఈ వైరస్ బయటపడకముందే వుహాన్ ల్యాబ్లో శాస్త్రవేత్తలు వైద్యసాయం కోరినట్లు వెల్లడించింది. దీంతో కరోనా గురించి ప్రపంచానికి తెలియకముందే, చైనా చెప్పకముందే ఈ శాస్తవేత్తలు వైరస్ బారిన పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
వుహాన్ ల్యాబ్లోనే పుట్టిన కరోనా
చైనాలోని వుహాన్ ల్యాబ్లోనే కరోనా పుట్టినట్లు ఇప్పటికే పలు ఆధారాలు బయటపడగా.. చైనా వాటిని పలుమార్లు తోసిపుచ్చింది. అయితే తాజాగా యూఎస్ నిఘా వర్గాలను ఉటంకిస్తూ వాల్స్ట్రీట్ జర్నల్ ఈ వాదనకు మద్దతుగా మరో కీలక ఆధారాన్ని బయటపెట్టింది. దీని ప్రకారం కరోనా వైరస్ ఉన్నట్లు ప్రపంచానికి తెలియకముందే వుహాన్ ల్యాబ్లో పనిచేసే శాస్త్రవేత్తలు తమకు వైద్యసాయం కావాలని కోరడమే ఇందుకు నిదర్శనంగా వాల్స్ట్రీట్ జర్నల్ చెబుతోంది. చైనా వాదన ప్రకారం కరోనా వైరస్ స్ధానిక చేపల మార్కెట్లో బయటపడినట్లు చెప్తుండగా.. ఇప్పుడు వుహాన్ ల్యాబ్లోనే పుట్టిందనడానికి మరో కీలక ఆధారం లభించినట్లయింది.
ల్యాబ్ నుంచే వైరస్ తప్పించుకుందా ?
వుహాన్ ల్యాబ్లో పనిచేసే ముగ్గురు శాస్త్రవేత్తలకు సంబంధించిన పూర్తి డేటాను వాల్స్ట్రీట్ జర్నల్ సంపాదించింది. ఇందులో వీరు ఎప్పుడెప్పుడు పరిశోధనలు సాగించారు, వారిలో ఎంతమందికి వైరస్ సోకింది, దానికి వారు ఎప్పుడు చికిత్స తీసుకున్నారు వంటి కీలక అంశాలపై ఆధారాలను వాల్స్ట్రీట్ జర్నల్ సంపాదించింది. వీటిపై ఆధ్యయనం చేసినప్పుడు కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే బయటికి వచ్చినట్లు తేలింది. ఈ నివేదికతో చైనా చేపల మార్కెట్ ఎపిసోడ్ అంతా అబద్ధమని తేలినట్లయింది.
డబ్ల్యూహెచ్వో విచారణపై అనుమానాలు
తాజాగా యూఎస్ నిఘా వర్గాలను ఉటంకిస్తూ వాల్స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనంతో ప్రపంచ ఆరోగ్య సంస్ధ చైనాతో కలిసి కరోనా జన్మస్ధానంపై జరుపుతున్న దర్యాప్తుపై అనుమానాలు మొదలయ్యాయి. దీనికి ప్రధాన కారణం చైనా, డబ్ల్యూహెచ్వో బృందాలు కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్లో పుట్టలేదని, బహిరంగ మార్కెట్లో బయటపడిందని మాత్రమే ఇప్పటివరకూ చెప్తున్నాయి. తాజా నివేదికతో వారిద్దరూ ఇరుకునపడినట్లయింది. ఈ వ్యవహారంలో చైనా పారదర్శకంగా వ్యవహరించాలని కోరుకుంటున్నట్లు అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజా రిపోర్ట్పై వాష్టింగ్టన్లో చైనా ఎంబసీ కూడా ఇప్పటివరకూ స్పందించలేదు.
కరోనా విచారణకు చైనా సహాయ నిరాకరణ
కరోనా జన్మస్ధలంపై ప్రపంచ ఆరోగ్యసంస్దతో కలిసి విచారణ జరుపుతున్నట్లు పైకి చెప్తున్నా అసలు వివరాలు ఇచ్చేందుకు మాత్రం చైనా అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని విచారణ కమిటీలో సభ్యుడొకరు వెల్లడించారు. ఓవైపు పాశ్చాత్యదేశాలతో పాటు భారత్ కూడా కరోనా వైరస్ జన్మస్ధలంపై చైనా పూర్తి వివరాలు పారదర్శకంగా అందించాలని కోరుతున్నా చైనా మాత్రం పట్టించుకోవడం లేదు. ఓసారి వుహాన్ ల్యాబ్తో వైరస్ లింకులు బయటపడితే తమకు ఇబ్బందులు తప్పవని చైనా భావిస్తుండటమే ఇందుకు కారణం.