YouGov poll: ప్రధాని రేసులో మూర్తి గారి అల్లుడికి షాక్: ఓటర్ల పల్స్ ఇదీ: మహిళ నేత వైపు మొగ్గు
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో అధికార కన్జర్వేటివ్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి రిషి సునక్.. అనూహ్యంగా వెనుకపడినట్టే కనిపిస్తోంది. దాదాపు అన్ని రౌండ్లల్లోనూ తిరుగులేని ఆధిక్యతతో దూసుకొచ్చిన ఆయన.. ప్రస్తుతం తనతో పాటు ఈ రేసులో నిల్చొన్న విదేశాంగ శాఖ మాజీ మంత్రి లిజ్ ట్రస్ నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటోన్నారు. మెజారిటీ బ్రిటీషర్లు లిజ్ ట్రస్ వైపే మొగ్గు చూపారు. గెలిచే అవకాశాలు ఆమెకే ఉన్నట్లు అంచనా వేస్తోన్నారు.
రిషి సునక్తో పెన్నీ మోర్డాంట్, లిజ్ ట్రస్, కెమ్మి బెడెనొచ్ పోటీలో ఉన్నప్పటికీ..ఆ తరువాతి రౌండ్లల్లో ఇద్దరు వైదొలిగారు. రిషి సునక్తో లిజ్ ట్రస్ రేసులో నిలిచారు. తరువాతి బ్రిటన్ ప్రధానమంత్రి ఎవ్వరనేది ఇంకా తేలాల్సి ఉంది. సోమవారం రిషి సునక్-లిజ్ ట్రస్ మధ్య లైవ్ డిబేట్ ఉంటుంది. ఆ తరువాత పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ను నిర్వహిస్తారు. ఈ రెండూ బోరిస్ జాన్సన్ వారసులెవరనేది దాదాపుగా ఖరారు చేస్తుంది.
రిషి సునక్కు గట్టి పోటీ ఇచ్చిన పెన్నీ మోర్డాంట్ కూడా ప్రధాని రేసు నుంచి తప్పుకొన్నారు. ఇది రిషి సునక్కు కొంత ఉపశమనం కలిగించినట్టే అయినప్పటికీ..మహిళా నేత లిజ్ ట్రస్ బలపడటం ఆందోళనకు గురి చేసే విషయమే. ఓట్ల సంఖ్యలో తనతో పాటు బరిలో ఉన్న ఇతర అభ్యర్థులెవరు దరిదాపుల్లో లేకుండా విజయం సాధిస్తూ వచ్చారు రిషి సునక్. బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునక్ ఎన్నిక కావడం లాంఛనప్రాయమేననే అభిప్రాయానికి వచ్చిన ప్రస్తుత పరిస్థితుల్లో యుగోవ్ సంస్థ నిర్వహించిన సర్వే నివేదిక కలకలం రేపింది.
పార్టీగేట్ వ్యవహారం తెర మీదికి వచ్చిన తరువాత బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ప్రధానిగా బోరిస్ జాన్సన్ కొనసాగడాన్ని అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యులెవరూ అంగీకరించలేదు. ప్రధానిగా కొనసాగడాన్ని వ్యతిరేకించారు. ఆయన ప్రభుత్వం నుంచి తప్పుకోవడం మొదలు పెట్టారు. ఇది- రిషి సునక్తోనే ఆరంభం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బోరిస్ జాన్సన్ కేబినెట్ సహచరులందరూ రాజీనామాలు చేశారు. దీనితో బోరిస్ జాన్సన్ తప్పుకోవాల్సి వచ్చింది.
యుగోవ్ నిర్వహించిన సర్వేలో 62 శాతం మంది బ్రిటన్ పౌరులు లిస్ ట్రస్ వైపు మొగ్గు చూపుతున్నారు. రిషి సునక్ గెలుస్తాడని భావిస్తోన్న వారి సంఖ్య 28 శాతం మాత్రమే ఉంటోంది. యుగోవ్ అనేది బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇంటర్నెట్ ఆధారిత మార్కెట్ రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ సంస్థ. తాజాగా ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో.. రిషి సునక్ కంటే లిజ్ ట్రస్ 28 పాయింట్ల మేర ఆధిక్యతలో కొనసాగుతున్నట్లు తేలింది.
730 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో 62 శాతం మంది లిజ్ ట్రస్కు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కంది. 38 శాఖ మంది రిషి సునక్ నాయకత్వానికి మద్దతు తెలిపినట్లు స్పష్టం చేసింది. క్రమంగా ఈ ఆంతర్యం మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని యుగోవ్ అంచనా వేసింది. ఇప్పుడున్న ట్రెండ్ను ఆధారంగా చేసుకుని చూస్తే-లిజ్ ట్రస్ గెలవడానికే పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది.