మొన్న భార్యతో బుట్టబొమ్మ సాంగ్ ఇరగదీసిన వార్నర్ నేడు పూజా హెగ్డేతోనే...వీడియో వైరల్
హైదరాబాద్: కరోనా మహమ్మారి లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. టిక్టాక్లో అడుగుపెట్టిన ఈ విధ్వంసకర బ్యాట్స్మన్.. రోజుకో వీడియోతో అభిమానులను అలరించాడు. తన పిల్లలు ఇండిరే, ఇవిమే.. సతీమణి క్యాండీస్తో కలిసి చేసిన టిక్టాక్ వీడియోలు సన్రైజర్స్ ఫ్యాన్స్ను తెగ ఆకట్టుకున్నాయి. ఇక హిట్సాంగ్ 'బుట్ట బొమ్మ'కు తన సతీమణి క్యాండిస్తో కలిసి చిందేసి టిక్టాక్లో స్టార్ అయ్యాడు. బుట్ట బొమ్మ పాటతోనే మరోసారి వార్తల్లో నిలిచాడు సన్రైజర్స్ సారథి.
ఐపీఎల్ 2020లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును డేవిడ్ వార్నర్ తన అద్భుత సారథ్యంతో ప్లే ఆఫ్ చేర్చిన విషయం తెలిసిందే. అయితే బ్యాటింగ్ వైఫల్యం కారణంగా క్వాలిఫయర్-1లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఒక అభిమాని వార్నర్కు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. బుట్టబొమ్మ పాట వీడియోలో హీరో అల్లు అర్జున్కు బదులుగా వార్నర్ ఫొటోను మార్ఫింగ్ చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ అయింది. ఆ వీడియోను సన్రైజర్స్ కెప్టెన్ వార్నర్ చూశాడు.
ఆ మార్ఫింగ్ వీడియోను చూసిన డేవిడ్ వార్నర్ పడిపడి నవ్వుతున్న ఎమోజీలను పెట్టి వీడియోను తన ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో రీపోస్టు చేశాడు. 'ఈ వీడియో చాలా బాగుంది. లాక్డౌన్ సమయంలో నాకు నచ్చిన పాట ఇది. ఐపీఎల్ 2020 సమయంలో ఈ పాట వింటూ బాగా ఎంజాయ్ చేశా' అని వార్నర్ పేర్కొన్నాడు. పూజా హెగ్డేతో వార్నర్ (డూప్లికేట్) చేసిన డాన్స్ చూసి ఫాన్స్ ఫిదా అయ్యారు. 'డేవిడ్ భాయ్ .. సూపర్ డాన్స్', 'పూజా హెగ్డేతో డాన్స్.. డేవిడ్ వార్నర్ ఇరగదీశాడుగా' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అచ్చం హీరోలాగే ఉన్నావని ఇంకొంతమంది అభిమానులు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
గతంలో ఒకసారి పోకిరి సినిమాలో హీరో మహేశ్ బాబు స్థానంలోనూ డేవిడ్ వార్నర్ ముఖంతో మార్ఫింగ్ చేసిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2020 టైటిల్ గెలిస్తే.. తన ఫేవరేట్ బుట్టబొమ్మ సాంగ్కు మళ్లీ డ్యాన్స్ వేస్తానని వార్నర్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్కు వాగ్దానం చేశాడు. అయితే హైదరాబాద్ జట్టు ఫైనల్ చేరలేకపోయింది. దీంతో వార్నర్ డాన్స్ మరోసారి చూసే అవకాశం మిస్ అయింది. ఏదేమైనా కీలకమైన ఆటగాళ్లు జట్టుకు దూరమైనా సన్రైజర్స్ చూపించిన పోరాట పటిమ అభిమానుల మనసులు గెలుచుకుంది.
'భారత్ నాకు రెండో ఇల్లు అయితే.. సన్రైజర్స్ నా కుటుంబం. ఈ ఫ్రాంచైజ్ పట్ల నాకు చాలా ఇష్టం ఉంది. సన్రైజర్స్ జట్టు వచ్చిన రెండో సంవత్సరం తర్వాత నేను కలిశాను. వేలం పాటలో నాకు చాలా మద్దతు దక్కింది. మేనేజ్మెంట్ మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది' అని డేవిడ్ వార్నర్ చాలాసార్లు చెప్పాడు. వార్నర్కు భారత్లో కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు.