IPL 2020: నా జెర్సీని వాళ్లకు ఎందుకిచ్చానో తెలుసా: ధోనీ
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తాను ఐపీఎల్కు కూడా దూరమవుతానని భావించి యువ ఆటగాళ్లంతా జెర్సీలు తీసుకున్నారని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ఇదే తన చివరి సీజన్ అని పొరపడ్డారని, కానీ తాను వచ్చే సీజన్ కూడా ఆడుతానని మహీ స్పష్టం చేశాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్లతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను చిత్తు చేసింది. పోతూ పోతూ కింగ్స్ పంజాబ్ను ఇంటికి తీసుకెళ్లింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ.. యువ ఆటగాళ్లంతా తన సంతకంతో కూడిన జెర్సీలు తీసుకోవడం వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించాడు. వాళ్లంతా తాను ఐపీఎల్కు కూడా వీడ్కోలు పలుకుతానని భావించారని తెలిపాడు.
'అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడంతో ఐపీఎల్కు కూడా గుడ్ బై చెబుతానని వారంతా భావించి ఉంటారు. కానీ అలాంటిదేం లేదు. వచ్చే సీజన్ ఆడుతా'అని ధోనీ క్లారిటీ ఇచ్చాడు. అయితే సెకండాఫ్లో ఆటగాళ్లంతా ధోనీ సంతకంతో కూడిన జెర్సీ తీసుకోవడంతో పాటు అతనితో ఫొటోలు కూడా తీసుకున్నారు. ఇంగ్లండ్ క్రికెటర్ జోస్ బట్లర్ నుంచి పాండ్యా బ్రదర్స్తో పాటు ఇతర యువ ఆటగాళ్లు కూడా ధోనీ జెర్సీని అందుకున్నారు. ఈ క్రమంలోనే మహీ ఐపీఎల్కు దూరమవుతాడనే ప్రచారం జరిగింది.
కానీ పంజాబ్తో మ్యాచ్కు ముందే మహీ క్లారిటీ ఇచ్చాడు. హోస్ట్ డానీ మోరిసన్ చెన్నై తరఫున ఇదే చివరి మ్యాచ్ కాదు కదా? అని ధోనీని ప్రశ్నించాడు. ధానికి ధోనీ నవ్వుతూ కచ్చితంగా కాదన్నాడు. దాంతో మహీ ఐపీఎల్ భవితవ్యంపై ఓ క్లారిటీ వచ్చింది. ఇక అనూహ్య నిర్ణయాలకు ధోనీ ఎప్పుడూ కేరాఫ్ అడ్రస్గా నిలుస్తాడు. 2014లో చెప్పపెట్టకుండా టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగిన మహీ.. ఈ ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు.
ఈ సీజన్లో చెన్నై ఏన్నడూ లేని విధంగా విఫలమైంది. ప్రతీ సీజన్లో కనీసం ప్లే ఆఫ్స్కు చేరిన ఆ జట్టు.. ఈ సారి ఏడో స్థానానికే పరిమితమైంది. ఆఖర్లో హ్యాట్రిక్ విజయాలందుకోవడంతో ఆ స్థానం దక్కింది లేకుంటే అట్టుడుగు స్థానంలో నిలిచి చెత్త రికార్డును మూటగట్టుకునేది.