KXIP vs MI : నేడు పంజాబ్-ముంబై ఢీ... గెలుపే లక్ష్యంగా బరిలోకి ఇరు జట్లు...
ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా అబుదాబి వేదికగా గురువారం(అక్టోబర్ 1) జరగబోయే 13వ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్-ముంబై జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్లో ఇప్పటివరకూ చెరో 3 మ్యాచ్లు ఆడిన రెండు జట్లు రెండింట్లో ఓటమిపాలై కేవలం ఒక మ్యాచ్లోనే విజయం సాధించాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ ఐదో స్థానంలో ఉండగా... ముంబై ఆరో స్థానంలో ఉంది.
Recommended Video
తాజా ఐపీఎల్లో ఈ రెండు జట్లలో కనిపిస్తున్న కామన్ పాయింట్... ఇరువురూ చెరో సూపర్ ఓవర్ మ్యాచ్లో ఓడిపోవడం. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో పంజాబ్ సూపర్ ఓవర్లో ఓడిపోగా... బెంగళూరుతో మ్యాచ్లో ముంబై సూపర్ ఓవర్లో చేతులెత్తేసింది. బలాబలాల పరంగా చూసుకుంటే రోహిత్ శర్మ,హార్దిక్ పాండ్యా,కీరన్ పొలార్డ్,ఇషాన్ కిషన్ లాంటి హార్డ్ హిట్టర్స్ ముంబైకి ప్రధాన బలం అని చెప్పాలి. పంజాబ్ జట్టుకు కేఎల్ రాహుల్,మయాంక్ అగర్వాల్,గ్లెన్ మ్యాక్స్వెల్ ప్రధాన బలంగా ఉన్నారు. గత మ్యాచ్లలో జరిగిన తప్పులను రిపీట్ చేయకుండా ఈసారి ఎలాగైన విజయం సాధించాలన్న కసితో ఇరు జట్లు రేపు బరిలో దిగనున్నాయి.
ఐపీఎల్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే... ఇప్పటివరకూ 24 సార్లు ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో 11 సార్లు పంజాబ్ విజయం సాధించగా... 13 సార్లు ముంబై విజయం సాధించింది.ముంబైపై పంజాబ్ యావరేజ్ స్కోరు 167 కాగా... పంజాబ్పై ముంబై యావరేజ్ స్కోరు 162. ఈ రెండు జట్లు గత ఐపీఎల్లో చివరిసారిగా తలపడ్డ మ్యాచ్లో కేఎల్ రాహుల్ తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. అయితే మూడు ఫోర్లు,10 సిక్సర్లతో పొలార్డ్ 83(31) విజృంభించడంతో పంజాబ్పై ముంబై విజయం సాధించింది. ఈ ఐపీఎల్లో తొలిసారిగా తలపడనున్న ఈ రెండు జట్ల మధ్య విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.