అసహనంతో రగిలిన విరాట్ కోహ్లీ: అంపైర్తో వాగ్యుద్ధం: ఆ రనౌట్ విషయంలో ఆర్గ్యుమెంట్
షార్జా: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ.. మరోసారి తన సహనాన్ని కోల్పోయాడు. మొన్నటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ వెన్నెముక సూర్యకుమార్ యాదవ్పై స్లెడ్జింగ్కు పాల్పడిన అతను.. ఈ సారి ఏకంగా అంపైర్పై అసహనాన్ని వ్యక్తం చేశాడు. అంపైర్ను ప్రభావితం చేసేలా వ్యవహరించాడు. బ్యాట్స్మెన్ అవుట్ ఇవ్వకపోవడాన్ని తప్పు పట్టాడు. అది అవుట్ కాదనే విషయం రీప్లేలో స్పష్టమైంది. థర్డ్ అంపైర్ డెసిషన్ వెలువడేంత వరకూ కోహ్లీ అసహనంగానే కనిపించాడు. ఇదివరకు చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తరహాలోనే అంపైర్పై ఫైర్ అయ్యాడతను.
Recommended Video
రనౌట్ విషయంలో..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జా స్టేడియంలో శనివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో తొమ్మిదో ఓవర్ను వేశాడు బెంగళూరు బౌలర్ యజువేంద్ర చాహల్. ఆ సమయంలో క్రీజ్లో వృద్ధిమాన్ సాహా, నాన్ స్ట్రయికర్ ఎండ్లో కేన్ విలియమ్సన్ ఉన్నారు. ఆ ఓవర్ తొలిబంతిని సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ వృద్ధిమాన్ సాహా ఎదుర్కొన్నాడు. ఆ ఫ్లైటెడ్ డెలివరీని స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు సాహా. లాంగ్ ఆన్ వైపు దూసుకెళ్తోన్న ఆ బంతిని డైవ్ చేస్తూ ఆపే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆ బంతి నేరుగా వెళ్లి నాన్ స్ట్రయికర్ ఎండ్ వైపు ఉన్న వికెట్ల బెయిల్స్ను ఎగురకొట్టింది.
అసలు కథ అప్పుడే..
అక్కడే అసలు కథ మొదలైంది. తన వేలిని తాకి ఆ బంతి వికెట్లకు తగిలిందని, అప్పటికి నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ కేన్ విలియమ్సన్ క్రీజ్ బయట ఉన్నాడని, అవుట్ ఇవ్వాలంటూ అప్పీల్ చేశాడు చాహల్. విరాట్ కోహ్లీ కూడా బిగ్ అప్పీల్ చేస్తూ అంపైర్ వద్దకు వచ్చాడు. దీనికి ఫీల్డ్ అంపైర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనితో కోహ్లీ అసహనానికి గురయ్యాడు. అంపైర్తో ఆర్గ్యుమెంట్కు దిగాడు. చాహల్ వెలిని తాకిన తరువాత బాల్.. నాన్ స్ట్రయికింగ్ ఎండ్ వికెట్లను తగిలిందని, ఆ వైపు ఉన్న బ్యాట్స్మెన్ను అవుటయినట్టేనని వాదించాడు.
థర్డ్ అంపైర్ జోక్యంతో..
కోహ్లీ, చాహల్ అప్పీల్ తరువాత డెసిషన్ను థర్డ్ అంపైర్పైకి వదిలేశాడు ఫీల్డ్ అంపైర్. ఆ బాల్ బౌలర్ చాహల్ వేలికి తగల్లేదని స్పష్టమైంది. పైగా- బంతి వికెట్లను తాగిలే సమయానికి కేన్ విలియమ్సన్ తన బ్యాట్ను క్రీజ్లో ఉంచాడు. ఇదంతా రీప్లేలో స్పష్టంగా కనిపించింది. చాహల్ వేలిని బంతి తాకలేదని తేలింది. దీనితో అది అవుట్ కాదంటూ థర్డ్ అంపైర్ షంషుద్దీన్ ప్రకటించాడు. అప్పటిదాకా- విరాట్ కోహ్లీ అంపైర్తో డిస్కస్ చేస్తూనే కనిపించాడు. ఈ వ్యవహారంపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమౌతున్నాయి. తనకు మ్యాచ్ గెలవడమే ముఖ్యమనే విషయాన్ని విరాట్ కోహ్లీ మరోసారి చాటిచెప్పాడని, స్పోర్టివ్నెస్ లేదని నిరూపించుకున్నాడని మండిపడుతున్నారు.
ఓటమితో ప్లేఆఫ్ అవకాశాలకు గండి..
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్.. 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 120 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని హైదరాబాద్ ఛేదించింది. 14.1 ఓవర్లలో అయిదు వికెట్లను కోల్పోయి 121 పరుగులను స్కోర్బోర్డుపై నమోదు చేసింది. ఆల్రౌండర జేసన్ హోల్డర్.. మెరుపులు మెరిసించాడు. 10 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇంకా అయిదు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకోవడంతో హైదరాబాద్ నెట్ రన్రేట్ మెరుగుపడింది.