హైదరాబాద్ టైటిల్ గెలవడమే మిగిలింది! ఈ జ్యోతిష్కుడు టోర్నీని ముందే ఊహించాడు
హైదరాబాద్: గతేడాది వన్డే ప్రపంచకప్ ముందు ఓ టీవీ షోలో బాలాజీ హసన్ అనే తమిళ జ్యోతిష్యుడు ఇంగ్లండ్ విశ్వవిజేతగా నిలుస్తుందని, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవుతాడని చెప్పాడు. అప్పట్లో అతని మాటలు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ప్రపంచకప్ ముగిసిన అనంతరం అతని మాట్లాడిన వీడియో దేశవ్యాప్తంగా హల్చల్ చేసింది. అతని జోస్యానికి ప్రతీ ఒక్కరు అవాక్కయ్యారు. అయితే తాజాగా మితుల్ అనే ఓ ట్విటర్ యూజర్ ఐపీఎల్ 2020 సీజన్ నుంచి ఉద్దేశించి జూలై 27న చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులను వీపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ మితుల్ జోస్యం.. ఆ అరవం జ్యోతిష్యుడిని తలదన్నేలా ఉంది.
ఐపీఎల్ 2020 సీజన్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శన యావరేజ్గా ఉంటుందన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరదన్నాడు. రాజస్థాన్ రాయల్స్ అట్టడుగు స్థానంలో నిలుస్తుందన్నాడు. కింగ్స్ పంజాబ్ కూడా ప్లే ఆఫ్స్కు చేరదన్నాడు. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ ఫ్లే ఆఫ్స్ చేరుతాయని, సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. టోర్నీ ప్రారంభానికి నాలుగు నెలల ముందు ఈ ట్వీట్ చేయగా ఇందులో చెప్పినట్లే ఇప్పటి వరకూ జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇక మితుల్ చెప్పినదాంట్లో హైదరాబాద్ టైటిల్ గెలవడం.. ఆర్సీబీ, ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరడం మాత్రమే మిగిలింది. ఈ రోజు ఆర్సీబీ-ఢిల్లీ మధ్య జరిగే మ్యాచ్తో ఆ జట్ల ప్లే ఆఫ్స్ బెర్త్పై క్లారిటీ రానుంది. గెలిచే జట్టు 16 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. ఓడిన జట్టు హైదరాబాద్-ముంబై మ్యాచ్ ఫలితం కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. ఒక వేళ హైదరాబాద్ గెలిస్తే కోల్కతాతో నెట్రన్ రేట్ ముఖ్యం కానుంది. ఇక మితుల్ చెప్పినట్లు ఢిల్లీ, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే.. ముంబైపై హైదరాబాద్ గెలవాలి.. ఆర్సీబీ-ఢిల్లీ మ్యాచ్ హోరా హోరీగా సాగాలి.
ఇక సన్రైజర్స్ హైదరాబాద్ను 2016 సెంటిమెంట్ ఊరిస్తోంది. ఆ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ.. ఫైనల్లో బెంగళూరును ఓడించి టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అప్పటి పరిస్థితులే ఇప్పుడు పునరావృతం కావడంతో మరోసారి హైదరాబాద్ టైటిల్ గెలుస్తుందని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా ఆర్సీబీపై విజయానంతరం ఇదే చెప్పాడు. 2016లో కూడా హైదరాబాద్ కారణంగానే కోల్కతా వెనుదిరగ్గా.. ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ కానుంది. ఇక మితుల్ జోస్యంలో కూడా ఇదే ఉండటంతో హైదరాబాద్ అభిమానులు ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.