IPL 2020: మేమింకా ప్లేఆఫ్ రేసులో ఉన్నాం.. అద్భుతం చేస్తాం: స్టీవ్ స్మిత్
దుబాయ్: యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2020లో తమ జట్టు ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగిందని రాజస్థాన్ రాయల్స్ సారథి స్టీవ్ స్మిత్ అన్నాడు. మా ప్లేఆఫ్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయని, మేమింకా చేయాల్సింది చాలావుందన్నాడు. ఐపీఎల్ 13వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. లీగ్ దశలో అన్ని జట్లు 13 మ్యాచ్లు ఆడేశాయి. ఇక అందరికీ మిగిలింది ఒక్క మ్యాచే. ప్రస్తుతం ఆరు జట్లు మూడు బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి. ఇందులో రాజస్థాన్ కూడా ఉంది.
ప్లేఆఫ్ ఆశలు ఇంకా సజీవం:
తాజాగా రాజస్థాన్ రాయల్స్ సారథి స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ... 'ఈ సీజన్లో మా పయనం బిన్నంగా ఉంది. పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్నాం. మా ప్లేఆఫ్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. మధ్యలో ఓటములు ఎదురైనా.. సరైన సమయంలో మేం పుంజుకోవడం సంతోషాన్నిచ్చింది. మేమింకా చేయాల్సింది చాలాఉంది. ఎవరు ఔటైతే ఎవరు క్రీజులోకి వెళ్లాలి వంటి అంశాలపై భిన్నమైన ప్రణాళికలు ఉన్నాయి. వాటిని వచ్చే మ్యాచులో కచ్చితంగా అమలు చేయాలి. చివరి మ్యాచ్ మాకు చాలా కీలకం' అని తెలిపాడు.
స్టోక్స్ అత్యంత విలువైన ఆటగాడు:
'గత మ్యాచులో రాణించలేదు కాబట్టి జోస్ బట్లర్కు మరోసారి ఐదో స్థానంలో అవకాశం ఇచ్చాం. ముందుగానే విజయం అందుకోవడంతో రన్రేట్ మెరుగైంది. బెన్ స్టోక్స్ వినూత్నమైన షాట్లు ఆడగలడు. అందుకే అతడు ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటగాడు. ఫీల్డర్లు లేనిచోట బంతిని పరుగెత్తిస్తాడు. ముంబై మ్యాచులో ఎక్కడ ఆపేశాడో పంజాబ్ పోరులో అక్కడే మొదలుపెట్టాడు.ఆటగాళ్లతో నిత్యం మాట్లాడుతూ వారిలోని అత్యుత్తమ ఆటతీరును బయటకు తీసుకురావడం అవసరం. అతడు నిలదొక్కుకుంటే పరుగుల వరద పారించగలడని మాకు తెలుసు' అని స్టీవ్ స్మిత్ అన్నాడు.

బంతిని బాదాలనే నిర్ణయించుకున్నా:
ప్రస్తుతం తామున్న స్థానంలో ఎవరున్నా కోల్పోయేందుకు ఏమీ ఉండదని బెన్ స్టోక్స్ పేర్కొన్నాడు. 'ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగా ఉండటం సంతోషకరం. భారీ సిక్సర్లు బాదేయడం ఆనందకరం. ముంబైపై ఎలాంటి దృక్పథంతో ఉన్నానో పంజాబ్పైనా అదే మనస్తత్వంతో ఆడాను. కొత్త బంతిని బాదాలనే నిర్ణయించుకున్నాను. చివరి మ్యాచ్ తర్వాత కాస్త విరామం లభించింది. ఏ బంతిని ఎలా కొడితే బౌండరీకి పోతుందో తెలియదు. అందుకే బాదడమే పనిగా పెట్టుకున్నా. అదే నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అలసిపోకూడదనే అంతకుముందు మ్యాచుల్లో నేను బౌలింగ్ చేయలేదు' అని స్టోక్స్ చెప్పాడు.
తక్కువ రన్రేట్:
సన్రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల ఖాతాల్లోనూ 12 పాయింట్లే ఉన్నాయి. అయితే బెంగళూరుపై విజయం సాధించిన సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకోవడమే కాకుండా నెట్ రన్ రేట్ భారీగా మెరుగుపరుచుకుంది. ఇదే ఇప్పుడు అన్ని జట్లకు శాపంలా మారింది. కోల్కతాతో జరుగనున్న చివరి మ్యాచ్లో రాజస్థాన్ గెలిస్తే.. వారికీ అవకాశం ఉంటుంది. అయితే రన్రేట్ తక్కువగా ఉండటం ఆ జట్టును దెబ్బకొట్టొచ్చు.












Click it and Unblock the Notifications