IPL 2021: తెలుగు ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సనరైజర్స్ ప్లేయర్స్
హైదరాబాద్: 'ఉగాది' పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వస్తుంది. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఈ పండుగను తెలుగు వారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరముగా జరుపుకుంటారు. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలలోనూ ఘనంగా జరుపుకుంటారు. ఇక ఉగాది పండుగ సందర్భంగా ఐపీఎల్ ప్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు అందరూ అభిమానులకు శుభాకంక్షాలు తెలిపారు. ఈ మేరకు సన్రైజర్స్ ఓ వీడియో రూపొందించి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
'మాతో పాటు మా కుటుంబం నుంచి కూడా మీకు హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు' అని సన్రైజర్స్ హైదరాబాద్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పంచుకుంది. వీడియోలో ప్రతిఒక్క ప్లేయర్ కూడా అభిమానులకు ఉగాది శుభాకంక్షాలు చెప్పారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఖలీల్ అహ్మద్, విజయ్ శంకర్, జాసన్ హోల్డర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, కేన్ విలియమ్సన్, జానీ బెయిర్స్టో సహా అందరూ 'ఉగాది శుభాకంక్షాలు' అని చెప్పారు. మన హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ తప్పితే.. మిగతావారు చెప్పింది వింటే కాస్త నవ్వు వస్తుంది. 'శుభాకంక్షాలు' అని చెప్పడానికి వారు కాస్త కష్టపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది.
ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వేదికలలో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ చురుగ్గా ఉంటుంది. ఆటగాళ్లకు సంబందించింది ప్రతిదీ పోస్ట్ చేస్తుంది. లీగ్ ఆరంభం నుంచే స్టార్ ఆటగాళ్లను తెలుగు హీరో పోస్టర్లతో ఎడిట్ చేసి అభిమానులను ఆకట్టుకుంది. ఈ సీజన్ తొలి మ్యాచుకు ముందు కూడా జట్టులోని కీలక ఆటగాళ్లకు హైదరాబాద్లోని నగరాల పేర్లను నిక్నేమ్గా పెట్టి అలరించింది. సన్రైజర్స్ ఏది పోస్ట్ చేసినా.. ఆ ట్వీట్ క్షణాల్లో వైరల్ అవుతోంది.
#Ugadi wishes from our family to yours 🥰#HappyUgadi #OrangeOrNothing #OrangeArmy #ఆరెంజ్ఆర్మీ pic.twitter.com/TKHmeCeKNG
— SunRisers Hyderabad (@SunRisers) April 13, 2021
ఐపీఎల్ 2021 కోసం సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్రస్తుతం చెన్నైలో ఉంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును సన్రైజర్స్ ఢీకొనబోతోంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ఆదివారం కోల్కతా నైట్రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచులో సన్రైజర్స్ ఓడిపోయింది. కోల్కతా నిర్దేశించిన 189 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరెంజ్ ఆర్మీ గెలుపు అంచుల వరకు వెళ్లి చతికిలబడింది. జానీ బెయిర్స్టో (55; 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు), మనీష్ పాండే (61 నాటౌట్: 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు.