IPL 2023 playoffs: రోహిత్ శర్మ నెత్తిన పాలు పోసిన ఆర్సీబీ
బెంగళూరు: ఐపీఎల్ 2023 చివరి లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చతికిలపడింది. ప్లేఆఫ్స్ ముంగిట్లో ఓటమిపాలైంది. గెలిచి తీరాల్సిన మ్యాచ్లో పరాజయాన్ని చవి చూసింది. ప్రత్యర్థి జట్టుకు భారీ స్కోర్ను నిర్దేశించినప్పటికీ దాన్ని కాపాడుకోలేకపోయింది ఆర్సీబీ. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ చేరే అవకాశాలను చేజేతులా పోగొట్టుకుంది. ఆర్సీబీ ఓటమి- ముంబై ఇండియన్స్ నెత్తిన పాలు పోసినట్టయింది. రోహిత్ సేన ప్లేఆఫ్స్కు చేరింది.
ఆదివారం రాత్రి బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో తలపడిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ఆరు వికెట్ల తేడాతో మట్టికరిచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్- అలవోకగా ఈ భారీ టార్గెట్ను ఛేదించింది. 19.1 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్లో కూడా రెండు సెంచరీలు నమోదయ్యాయి. ఆర్సీబీ ఇన్నింగ్లో విరాట్ కోహ్లీ మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. 61 బంతుల్లో ఒక సిక్స్, 13 ఫోర్లతో 101 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్-28, మిఛెల్ బ్రేస్వెల్-26, అనూజ్ రావత్-23 పరుగులు చేశారు. ఐపీఎల్ 2023లో విరాట్ కోహ్లీ సాధించిన రెండో సెంచరీ ఇది. సన్రైజర్స్ హైదరాబాద్పైనా అతను ఈ మార్క్ను అందుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్లో ఓపెనర్ శుభ్మన్ గిల్ పరుగుల వరద పారించాడు. 52 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, అయిదు ఫోర్లతో 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. వన్డౌన్ బ్యాటర్ విజయ్ శంకర్ అర్ధసెంచరీతో రాణించాడు. వర్షం వల్ల ఆలస్యంగా ఆరంభమైన ఈ మ్యాచ్లో రెండు జట్లలోనూ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. బంతిపై పట్టు కోల్పోయారు. ఫలితంగా భారీ స్కోర్లు నమోదయ్యాయి.
ఈ ఓటమితో ఆర్సీబీ- ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకొంది. ఈ మ్యాచ్లో గెలిచివుంటే ప్లేఆఫ్స్కు చేరుకుని ఉండేదే గానీ ఫలితం మరోలా వెలువడింది. భారీ స్కోర్ చేసినా గానీ ఓటమి కోరల నుంచి తప్పించుకోలేకపోయింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ల ఎదురుదాడికి ఆర్సీబీ వేసుకున్న వ్యూహాలన్నీ చిత్తు చిత్తయ్యాయి. శుభ్మన్ గిల్ను పెవిలియన్ దారి పట్టించడంలో ఘోరంగా విఫలం అయ్యారు బౌలర్లు.

అంతకుముందు జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్.. సన్రైజర్స్ హైదరాబాద్పై ఘన విజయాన్ని సాధించింది. తన ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగలిగింది. ముంబై ఇండియన్స్ కంటే మెరుగైన నెట్ రన్రేట్ను కలిగి ఉండటం వల్ల ఆర్సీబీ గెలుపోటముల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆర్సీబీ ఓటమితో రోహిత్ సేన ప్లేఆఫ్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. లీగ్స్ ముగిసే సరికి- ఆ జట్టు 20 పాయింట్లతో టాప్ పొజీషన్లో నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్-17, లక్నోసూపర్ జెయింట్స్-17, ముంబై ఇండియన్స్-16 పాయింట్లను సాధించాయి. ఈ నాలుగు జట్లు కూడా ప్లేఆఫ్స్ చేరాయి. 14 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ అయిదో స్థానంలో నిలిచింది.
కాగా- మంగళవారం తొలి ప్లేఆఫ్ షెడ్యూల్ అయింది. గుజరాత్ టైటాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. ఇది క్వాలిఫయర్ 1. బుధవారం రెండో ప్లేఆఫ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్- ముంబై ఇండియన్స్ ఢీ కొట్టనున్నాయి. సాయంత్రం 7:30 గంటలకు చెన్నై స్టేడియంలోనే ఈ మ్యాచ్ కూడా షెడ్యూల్ అయింది. ఇది ఎలిమినేటర్.
26వ తేదీన క్వాలిఫయర్ 2 అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉంటుంది. క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు- ఎలిమినేటర్లో గెలిచిన జట్టును ఢీకొడుతుంది. 28వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఇదే స్టేడియంలో నిర్వహిస్తారు. క్వాలిఫయర్ 1లో గెలిచిన జట్టు- ఎలిమినేటర్లో గెలిచిన జట్టు ఫైనల్స్లో తలపడతాయి. గత ఏడాది ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు కూడా ప్లేఆఫ్స్ చేరడం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడం చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications