రాజధాని అమరావతినే .. కాదంటే కడప రాజధాని చెయ్యాలని కొత్త వాదన
ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటన మూడు రాజధానుల అంశంపై ఏపీ అట్టుడికిపోతోంది. ఇక ఇదే సమయంలో రోజుకో కొత్త వాదనలు ఏపీలో హల్చల్ చేస్తున్నాయి . రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చెయ్యాలని కొందరు అంటే, బెంగళూరు రాజధాని చెయ్యమని మరికొందరు, తిరుపతిలో రాజధాని పెట్టాలని మరికొందరు ఇలా రకరకాల డిమాండ్ వినిపిస్తున్నాయి. ఇక తాజా గా రాజధాని అమరావతినే మార్చేది లేదని ఒకవేళ మార్చాలి అనుకుంటే కడపలో రాజధాని పెట్టాలని సరికొత్త డిమాండ్ వినిపిస్తుంది.

కడప ప్రెస్ క్లబ్ లో అఖిలపక్ష భేటీ.. కీలక నిర్ణయం
రాజధాని అమరావతిపై కడప ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అమరావతే రాజధానిగా నూటికి నూరు శాతం కొనసాగించాలని లేదంటే రెండో ఆప్షన్ గా కడపలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. కడపలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీలు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాయి .ఇక ఈ భేటీలో మాట్లాడిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ప్రజలందరికీ అందుబాటులో ఉన్న అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

అమరావతిలో కాకుంటే రాజధాని కడపలో పెట్టాలని డిమాండ్
అలా వీలు కాదు , రెండో ఆప్షన్ ఉంటే కడపలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా రాజధాని ఏర్పాటుకు అనుకూల ప్రాంతం అని ఆయన పేర్కొన్నారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన వనరులు జిల్లాలో ఉన్నాయన్నారు. కడప సమీపంలోనే పారిశ్రామికవాడలో 6వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములున్నాయన్నారు. అంతేకాదు ఎయిర్పోర్టు, రైల్వే కనెక్టివిటీ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు .

సీఎం జగన్ కు సొంత గడ్డ పై ప్రేముంటే ఆ పని చెయ్యాలన్న టీడీపీ నేత
సీఎం జగన్కు సొంత జిల్లాపైన ప్రేమ ఉంటే, వెనుకబడ్డ రాయలసీమపై అభిమానం ఉంటే కడపలోనే రాజధానిని ఏర్పాటు చేయాలన్నారు. అమరావతి లేదంటే కడప అంటూ కడపలో అఖిల పక్ష భేటీలో పాల్గొన్న నాయకులు తీర్మానం చేశారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగింపు కోసం జేఏసీ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తామని వారు పేర్కొన్నారు . సీఎం జగన్ చంద్రబాబుపై కక్షతో రాజధాని తరలింపునకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్న వారు ఇప్పుడు అనవసరంగా ఏపీలో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చారని జగన్ పై మండిపడ్డారు.

రాజధాని పై భిన్న వాదనలు.. అయినా జగన్ నిర్ణయమే ఫైనల్
ఇక ఇప్పటికే జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన నేపధ్యంలో రోజుకో వాదన వినిపిస్తుంది. మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేస్తే ముగ్గురు సీఎం లు కావాలని కూడా డిమాండ్ వినిపిస్తుంది. రాజధాని అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే వాళ్ళపై కేసులు పెట్టాలి చర్యలు తీసుకోవాలి కానీ రాజధాని మార్చాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు రాజధాని అమరావతినే నిర్మాణం చెయ్యలేని ఏపీ సర్కార్ మూడు రాజధానులను ఎలా నిర్మిస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. ఎవరికి వయు తమ డిమాండ్లను వినిపిస్తున్నా సీఎం జగన్ మాత్రం తాను అనుకున్నది చేసే పనిలో నిమగ్నమైపోయారు.












Click it and Unblock the Notifications