తొలిసారి తాత పేరు: కడప స్టేడియానికి అంతర్జాతీయ హోదా: సీమ ముంగిట్లో డే/నైట్ మ్యాచ్లు
కడప: కడప జిల్లాలో తొలిసారిగా ఏర్పాటైన క్రికెట్ స్టేడియానికి ఇక అంతర్జాతీయ హోదా దక్కబోతోంది. ఈ స్టేడియంలో వన్డే ఇంటర్నేషనల్స్ నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నాహాలు చేసే అవకాశాలు లేకపోలేదు. డే/నైట్ మ్యాచ్లను నిర్వహించడానికి వీలుగా.. ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా ఆ సౌకర్యం కడప స్టేడియానికి లేదు. తాజాగా- ఆ కొరతను తీర్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకాస్సేపట్లో ఈ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు- కొన్ని మౌలిక సదుపాయాలను కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
కడప శివార్లలోని పుట్లంపల్లి వద్ద నిర్మించిన స్టేడియం ఇది. సుమారు 80 ఎకరాల్లో ఇది నిర్మితమైంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మూడేళ్లలో దాని నిర్మాణం పూర్తయింది.
తరచూ దేశవాళీ మ్యాచ్లను బీసీసీఐ అక్కడ నిర్వహిస్తోంది. దీని నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు ప్రస్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధీనంలో ఉంటోొంది. ఈ స్టేడియానికి వైఎస్ రాజారెడ్డి పేరు పెట్టారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన తండ్రి పేరు మీద దీన్ని నెలకొల్పారు. మనవడు వైఎస్ జగన్ హయాంలో ఈ స్టేడియం అంతర్జాతీయ కళను సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
తన రెండు రోజుల పర్యటన సందర్భంగా వైఎస్ జగన్.. ఈ సాయంత్రం కడపకు రానున్నారు. ప్రస్తుతం ఆయన బద్వేలులో పర్యటిస్తోన్నారు. బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ వెంటనే ఆయన కడపకు బయలుదేరి వస్తారు. నేరుగా పుట్లంపల్లి వద్ద నిర్మించిన స్టేడియానికి చేరుకుని, ఫ్లడ్ లైట్ల నిర్మాణం, కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
Recommended Video
ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత వైఎస్ జగన్ కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళ్తారు. ఈ స్టేడియానికి సంబంధించిన డ్రోన్ షాట్లను జిల్లా అధికార యంత్రాంగం కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది.
కడప వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన..#kadapa #ysjaganmohanreddy #acacricketstadium #ysjagan #oneindiatelugu pic.twitter.com/GhhyyIKoZC
— oneindiatelugu (@oneindiatelugu) July 9, 2021