విషాదం : వైఎస్సార్ సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..
కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం(మే 6) తీవ్ర అస్వస్థతకు గురై ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఐసీయూలో ఆయనకు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. శుక్రవారం(మే 8) స్థానిక వైఎంఆర్ కాలనీలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
శివారెడ్డి 1978లో కమలాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. శివారెడ్డి మృతితో ఆయన స్వగ్రామమైన ఎర్రగుంట్లలో విషాదఛాయలు అలముకున్నాయి. జిల్లాకు చెందిన పలువురు నేతలు ఆయనకు సంతాపం ప్రకటించారు. పలువురు ఆయనతో పనిచేసిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.ప్రొద్దుటూరులో సాయంత్రం 4గంటలకు శివారెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.