సౌరశక్తి కేంద్రంపై విరుచుకుపడ్డ దుండగులు.. 3 కోట్ల మేర సోలార్ ఫలకాలు ధ్వంసం..!
మైలవరం : కడప జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడమే లక్ష్యంగా విధ్వంసం సృష్టించారు. ఆ క్రమంలో దాదాపు 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిలినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఏదో చోట ఇలాంటి ఘటనలు జరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
కడప జిల్లాలోని మైలవరం మండల పరిధిలోని రామచంద్రాయపల్లెలో విధ్వంసం సృష్టించారు దుండగులు. సౌర విద్యుత్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. దాదాపు 1700 సౌర ఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

దుండగుల దాడితో 1700 సౌర ఫలకాలు పనికిరాకుండా పోయినట్లు తెలుస్తోంది. దాదాపు మూడు కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. రామచంద్రాయపల్లెలో 250 మెగావాట్లతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటవుతోంది. అయితే సౌర ఫలకాలను దుండగులు ధ్వంసం చేశారనే సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అయితే దుండగులు ఎవరు, వారికి సౌర ఫలకాలు ధ్వసం చేయాల్సిన అవసరం ఏముందనే కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications