డిష్యూం.. డిష్యూం... ఈటల అనుచరులు వర్సెస్ టీఆర్ఎస్ కార్యకర్తలు
టీఆర్ఎస్ పార్టీలో ఈటల రాజేందర్ వ్యవహారం పీక్కు చేరుతోంది. ఏవో ఆరోపణల మీద.. మంత్రి పదవీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఈటల రాజేందర్ కూడా అదేస్థాయిలో ఉన్నారు. దూకుడుగా వెళుతున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ.. భట్టి విక్రమార్కతో సమావేశంతో కాక రేపారు. ఇదిలా ఉంటే ఈటల అనుచరులు, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
అధికార టీఆర్ఎస్లో ఈటల వ్యవహారం రోజు రోజుకీ ముదురుతోంది. టీఆర్ఎస్ కార్యకర్తలు, ఈటల వర్గీయులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇవాళ వీణవంకలో టీఆర్ఎస్ నిర్వహించిన ప్రెస్మీట్ రసాభాసాగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు ప్రెస్మీట్ పెట్టారు. సరిగ్గా ఈ సమయంలో ఈటల వర్గీయులు అక్కడికి చేరుకొని, వాగ్వాదానికి దిగారు.
టీఆర్ఎస్ నేతలకు, ఈటల వర్గీయులకు మధ్య తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పారు. అయినా వినిపించుకోలేదు. దీంతో ఈటల వర్గీయులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక్కడే కాదు చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈటల అనుచరులు ఊరుకోవడం లేదు. స్వయంగా ఈటల వద్దు అని చెప్పినా.. టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి ప్రతిస్పందన వస్తే.. వెంటనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
ఈటల రాజేందర్ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల భట్టితో భేటీతో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతకుముందు బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. కానీ అవీ రుమార్లుగానే మిగిలిపోయాయి.