గెలుపు తథ్యం: కేటీఆర్ కామెంట్స్ దానికి నిదర్శనం.. ఈటల రాజేందర్
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ జోస్యం చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్లో ఎవరు గెలిచినా.. తమ ప్రభుత్వం కూలిపోయేది లేదని మంత్రి కేటీఆర్ కామెంట్ చేయడం బాధాకరమన్నారు. తాను గెలుస్తున్నా అని రిపోర్ట్లు వచ్చాయని, ఓడిపోతున్నామనే భయంతో కేటీఆర్ ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారని తెలిపారు. మీరు గెలిస్తే గొర్ల మంద మీద తోడేళ్లు పడ్డట్లు ఎమ్మెల్యేలు, మంత్రులు నియోజకవర్గంపై ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు.
సొంత పార్టీ నాయకులను ప్రలోభపెట్టి, ఖరీదు కట్టి చిల్లర పనులు చేసి కేసీఆర్ అభాసుపాలయ్యారని తెలిపారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదని ఈటల రాజేందర్ ఎద్దేవాచేశారు. ఏడు సంవత్సరాల తర్వాత సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారని చెప్పారు. తన డిమాండ్తో సీఎంవో కార్యాలయంలో దళితుడు రాహుల్ బొజ్జాను, ఉన్నత విద్యామండలి చైర్మన్గా లింబాద్రిని నియమించారని తెలిపారు. ఎవరి జాగాలో వారు ఇళ్లు కట్టుకునేందుకు నిధులు ఇవ్వాలని, అర్హులైన ప్రతీ కుటుంబానికి పేద బంధు ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

గత సాధారణ ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాజీనామా చేశారు. ఈటల రాజేందర్ రాజీనామాను స్పీకర్ కూడా ఆమోదించారు. దీంతో హుజురాబాద్లో ఎన్నికలు అనివార్యం అయ్యింది. ఇటు దళితులను ఆకట్టుకునేందుకు దళితబంధు పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎవరు గెలుస్తారు.. ప్రజలు ఎవరికీ పట్టం కడతారు?? బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీ చేయనున్నారు. ఉప ఎన్నికల కారణంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తున్నారు.
Recommended Video
నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ.. వకులాభరణానికి బీసీ కమిషన్ చైర్ పర్సన్, ఇతర సభ్యులను కూడా నియమించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలవాలని టీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. అందుకోసమే హామీలను ఇస్తూ ముందుకు సాగుతోంది. కొన్ని నామినేటెడ్ బెర్తులను ఖరారు కూడా చేస్తోంది.












Click it and Unblock the Notifications