జగిత్యాల వాసి అరుదైన ఘనత: ఫోర్బ్స్ జాబితాలో సాగి రఘునందన్ రావుకు చోటు
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సాగి రఘునందన్ రావు అరుదైన ఘనతను సాధించారు. ఫోర్బ్స్ సీఐవో-2022 జాబితాలో సాగి రఘునందన్ రావుకు చోటు దక్కింది. ఈ విషయాన్ని జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం వెంగళాయిపేట గ్రామానికి చెందిన రఘునందన్ రావు తల్లిదండ్రులు డాక్టర్ సాగి సంజీవరావు, పుష్పలత వెల్లడించారు.
ప్రస్తుతం ఆమెరికాలోని అట్లాంటాలో నివాసముంటున్న రఘునందన్ రావు ఆదివారం తమతో మాట్లాడి ఫోర్బ్స్ సీఐవో జాబితాలో చోటు దక్కిందని తెలిపారని ఆనందం వ్యక్తం చేశారు. ఇన్స్పైర్ బ్రాండ్స్ అంతర్జాతీయ కంపెనీకి సీఐవోగా పనిచేస్తున్నారని తెలిపారు. కాగా, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బ్యాంకు కాలనీలో నివాసముంటున్నారు సంజీవరావు దంపతులు.
రఘునందన్ రావు తన ప్రాథమిక విద్యను వరంగల్లోని సరస్వతి శిశు మందిర్లో, జగిత్యాలలోని గీతా విద్యాలయంలో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేశారని చెప్పారు. గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్, హైదరాబాద్లోని జేఎన్టీయూలో ఇంజినీరింగ్ చదివారని తెలిపారు. ఆ తర్వాత 1992లో అమెరికాలోని సౌతర్స్ ఎలినియోస్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవడానికి వెళ్లారని చెప్పారు.
ప్రముఖ కాస్మెటిక్ కంపెనీ సెఫోరాలో పనిచేసిన అనంతరం వాల్మార్ట్లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంజినీర్గా రఘునందన్ రావు విధులు నిర్వహించారని సంజీవరావు తెలిపారు. ప్రస్తుతం రఘునందన్ రావు ఇన్స్పై బ్రాండ్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. త్వరలో విడుదల చేసే ఫోర్బ్స్ సీఐఓ జాబితాలో రఘునందన్ రావు స్థానం దక్కించుకోవడం ఆనందంగా ఉందని సంజీవరావు దంపతులు తెలిపారు.
తన చిన్న తనం నుంచి క్రమశిక్షణతో పెంచి, తనకు ఎప్పుడు ప్రోత్సాహం అందించిన తల్లిదండ్రుల వల్లనే తాను ఈ ఘనత సాధించినట్లు రఘునందన్ రావు తెలిపారు. తన కల నెరవేరడమే కాకుండా, దేశ ప్రతిష్టను మరింత పెంచే అవకాశం తనకు రావడం అధృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు రఘునందన్ రావు.