కరీంనగర్లో స్మార్ట్ సిటీ.. 3600 మందికి ఉద్యోగాలు.. నెంబర్ 1 గా చేస్తాం : గంగుల
కరీంనగర్ : స్మార్ట్ సిటీ పనులు బుధవారం (11.09.2019) నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్కు స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత ముమ్మాటికీ సీఎం కేసీఆర్దే అన్నారు. దసరా నాటికి ఐటీ టవర్ కంప్లీట్ చేస్తామని.. తద్వారా 3 వేల 600 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు కరీంనగర్ను పర్యాటక కేంద్రంగా మార్చడంతో పాటు బిజినెస్ సెంటర్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కరీంనగర్లో మెడికల్ కాలేజీ స్థాపించేలా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తామన్నారు.
కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో తాను తప్ప ఇంతవరకు వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎవరూ గెలవలేదని గుర్తు చేశారు కమలాకర్. తనను హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ మాట ఇస్తే తప్పరని.. అదే విధంగా తనను మంత్రిని చేశారని.. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయబోనంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక ముఖ్యమంత్రిలాగా ఉండరని.. ఆయనను చూస్తే ఓ డిక్షనరీలాగా కనిపిస్తారని చెప్పుకొచ్చారు.
ఇంటిని చక్కదిద్దుకున్న కేటీఆర్.. ఇంతకు ఏం చేశారంటే..!
కరీంనగర్పై కేసీఆర్కు మమకారం ఉందని.. అదే అభిమానంతో ఉమ్మడి జిల్లాకు నాలుగు మంత్రి పదవులు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. కరీంనగర్ అంటే ఆయనకు సెంటిమెంట్ బాగా ఉందని.. అదే క్రమంలో నాలుగు మంత్రి పదవులతో పాటు ఓ కేబినెట్ హోదా పదవి ఇవ్వడం హర్షణీయమని వ్యాఖ్యానించారు.
తాను మంత్రి పదవి కోసం మొదటి విడతలోనే ఆశించానని.. అయితే రెండో విడతలో ఆ అవకాశం దక్కిందన్నారు. ఆ క్రమంలో పార్టీ కోసం ఇంకా శ్రమిస్తానని చెప్పుకొచ్చారు. తనకు కేటాయించిన శాఖను మిగతా శాఖలను మించి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు.