రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు.. వేములవాడలో సైకత శివలింగం
వేములవాడ : దక్షిణ కాశీగా వెలుగొందుతున్న ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం కొత్త శోభ సంతరించుకుంది. మహా శివరాత్రి సందర్భంగా రాజన్న సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. 3 రోజుల పాటు జరగనున్న వేడుకలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొందరు భక్తులు సోమవారం సాయంత్రం వరకు వేములవాడకు చేరుకుని స్వామి సన్నిధిలోనే జాగారం చేయడం ఆనవాయితీ. ఆలయ సమీపంలోని వాగులో కొలువుదీరిన సైకత శివలింగం ఎంతగానో ఆకట్టుకుంటోంది.
హైదరాబాద్కు అతిదగ్గర్లో..! శివరాత్రి వేడుకలకు కీసరగుట్ట ముస్తాబు
జనసంద్రంగా రాజన్న సన్నిధి
వేములవాడ జనసంద్రమైంది. రాజన్న దివ్యక్షేత్రం మరింత శోభాయామానంగా మారి భక్తులను అలరిస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా రాజన్న సన్నిధికి పెద్దసంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారు. రద్దీ దృష్ట్యా గర్భగుడిలో నిర్వహించే అభిషేక పూజలు తదితర వాటిని రద్దు చేశారు. సోమ, మంగళవారాల్లో భక్తులందరికీ లఘుదర్శనమే కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు.
ఆనవాయితీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వేములవాడ రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే రమేశ్ బాబు కూడా ఉండనున్నారు. ప్రతి యేటా రాజన్నకు ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అటు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు టీటీడీ ఏఈవో.
ఎందెందు చూసినా నీవేనయా.. శివయ్యా
శివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడలో రూపొందించిన సైకత శివలింగం విశేషంగా ఆకట్టుకుంటోంది. రాజన్న సన్నిధికి సమీపంలో ఉన్న వాగులో దీన్ని రూపొందించారు సైకత శిల్పి రేవెళ్లి శంకర్. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూర్ కు చెందిన శంకర్.. శివరాత్రి సందర్భంగా సైకత శివలింగం రూపుదిద్దారు. ఇసుకతో తయారుచేసిన శివలింగాన్ని చూసిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు.
ఆ సమయాన శివుడిని దర్శించుకుంటే..!
మహా శివరాత్రి పురస్కరించుకుని సోమవారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల వరకు స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమం నిర్వహిస్తారు. వేములవాడకు చెందిన 128 కుటుంబాల అనువంశిక అర్చకులతో ఘనంగా అర్చన కార్యక్రమం జరపనున్నారు. ఏకధాటిగా 3 గంటల పాటు జరగనున్న లింగార్చనతో రాజన్న సన్నిధి వేదఘోషతో మార్మోగనుంది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ సమయంలో నిర్వహించే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అత్యంత వైభవంగా చేపట్టనున్నారు. ఆ సమయాన శివుడిని దర్శించుకుంటే జన్మధన్యమైనట్లుగా నమ్ముతారు భక్తులు.