పడింది పంచ్.. ఆర్టీసీ బస్సు సీజ్.. లెక్క తప్పిందిగా? (వీడియో)
జగిత్యాల : ఆనాటి ప్రమాదం అధికారులను నిద్ర లేపిందా? ఆర్టీసీ నిర్లక్ష్యం కారణంగా 65 మంది ప్రాణాలు బలిగొన్న అప్పటి యాక్సిడెంట్ ఇప్పటికైనా కళ్లు తెరిపించిందా? దేశంలోనే అతిపెద్ద ప్రమాద ఘటన కొండగట్టు ఇన్సిడెంట్ పాఠాలు నేర్పిందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు తాజాగా జగిత్యాల జిల్లాలో జరిగిన సంఘటన అవుననే బలం చేకూరుస్తోంది. ఆ క్రమంలో జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారులు కొరడా ఝలిపించారు. ప్రైవేట్ వాహనాలపై నిఘా పెట్టే అధికారులు ఈసారి ఆర్టీసీ బస్సుపై కన్నేశారు. రూల్స్ బ్రేక్ చేసిన ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు.
ఆర్టీవో అధికారుల కొరడా.. ఆర్టీసీకి బ్రేక్
జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారులు కొరడా ఝలిపించారు. నిబంధనలు అతిక్రమించిన ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు. కొడిమ్యాల గ్రామం దగ్గర బస్సును నిలువరించిన జిల్లా రవాణా శాఖ అధికారి కిషన్ రావు తొలుత ప్రయాణీకులను కిందకు దించారు. అనంతరం బస్సును సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఓవర్ లోడ్తో ప్రయాణీస్తుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కోరుట్ల డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు పరిమితికి మించి ప్రయాణీకులతో వెళుతుండగా కొడిమ్యాల గ్రామం దగ్గర అడ్డుకున్నారు కిషన్ రావు. అనంతరం నిలబడి ప్రయాణం చేస్తున్న కొందరిని కిందకు దించి ఆయన బస్సు ఎక్కారు. సీట్లలో కూర్చున్నవారిని లెక్కించారు. అయితే వాస్తవానికి బస్సులో 55 మంది ప్రయాణీకులను మాత్రమే ఎక్కించుకోవాలి. తీరా చూస్తే 125 మంది ప్రయాణీకులు కనిపించారు. దాంతో ఆయన సీరియస్ అయి బస్సును సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

కొండగట్టు ప్రమాదం.. ఇంకా గుణపాఠం నేర్వరా..!
2018, సెప్టెంబరులో కొండగట్టు దగ్గర జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదాన్ని ఇంకా ఎవరూ మరచిపోలేదు. దేశంలోనే అది అతిపెద్ద రోడ్డు ప్రమాదమని తేల్చారు అధికారులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం సంతాపం ప్రకటించిన సందర్భం అది. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రమాదంలో 65 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
శాఖాపరంగా ఇచ్చే అవార్డులు, రివార్డుల కోసం కక్కుర్తిపడి జగిత్యాల డిపో మేనేజర్ హనుమంతరావు డ్రైవర్లపై వత్తిడి పెంచిన కారణంగా ఆ ప్రమాదం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఆయా రూట్లలో డిజీల్ తక్కువగా వాడి ఎక్కువ ఆదాయం తెచ్చేలా డ్రైవర్లను ప్రోత్సహిస్తూ కొండగట్టు ప్రమాదానికి కారణమయ్యారనే వాదనలు వినిపించాయి. ఓవర్ లోడ్ కారణంగానే కొండగట్టు ప్రమాదం జరిగినట్లు అప్పట్లో ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆ మేరకు డిపో మేనేజర్ పై సస్పెన్షన్ వేటు పడింది.

ప్రైవేట్ వాహనాలకు, ఆర్టీసీకి తేడా ఏది?
సంస్థ ఆదాయం పెంచి టార్గెట్లు రీచ్ కావడం కోసం జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు ఆర్టీసీ అధికారులు. యాక్యుపెన్సీ రేషియో పెంచుకోవాలనే తాపత్రాయంతో కొన్ని రూట్లలో పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించేస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం వద్దు.. ఆర్టీసీ ప్రయాణం ముద్దు అంటూ తాటికాయంత అక్షరాలతో బస్సులో కొటేషన్లు రాయించే అధికారులు.. తాము అదే తప్పు చేస్తున్నామనే విషయం లైట్గా తీసుకుంటున్నారు. ఓవర్ లోడ్ కారణంగానే ప్రైవేట్ వాహనాలు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయంటూ లెక్చర్లు ఇచ్చే ఆర్టీసీ అధికారులు తీరా అదే తప్పు చేస్తుండటం గమనార్హం.
మొత్తానికి పరిమితిని మించి ప్రయాణీకులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును జగిత్యాల జిల్లా ఆర్టీవో సీజ్ చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. 55 మందితో వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు 125 మంది లోడ్తో వెళుతున్న క్రమంలో ఒకవేళ ప్రమాదానికి గురైతే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఊహించుకోవడం కష్టమే. అదలావుంటే ఇలాంటి విషయాల్లో జనాల్లో కూడా అవగాహన పెరగాల్సిన అవసరముంది. ఓవర్ లోడ్తో వెళ్లే బస్సులను తాము అడ్డుకోవాల్సింది పోయి అలాంటి బస్సుల్లో ఇలా పరిమితికి మించి ఎక్కడం మాత్రం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications